1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 10 నవంబరు 2021 (18:45 IST)

బంద‌రులో కార్తీక పౌర్ణ‌మి స‌ముద్ర స్నానాల‌కు భారీ ఏర్పాట్లు

బంద‌రులో ఈ నెల 19 వ తేదీన కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు 2 లక్షల మందికి పైగా భక్తులు మంగినపూడి బీచ్ కు వస్తారని ఒక అంచనా. పక్కా ప్రణాళికతో జిల్లా  రెవెన్యూ, పోలీసు, మత్స్య, వైద్య, అగ్ని మాపక ఆర్టీసీ, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య  ఆదేశించారు. 

 
మంత్రి త‌న కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన నేరుగా కలుసుకున్నారు. చిలకలపూడి పాండురంగస్వామి ఆలయ కమిటీ పెద్దలు మంత్రిని కలిసి కార్తీక పౌర్ణమి 19 వ తేదీన చిలకలపూడి పాండురంగస్వామి రథోత్సవం భక్తులకు అవసరమైన ఏర్పాట్ల విషయమై ప్రస్తావించారు. స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి తప్పక సహకారం సమన్వయం ఆలయ కమిటీకి ఉంటుందని అన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో జరగబోయే ప్రత్యేక సమావేశానికి మీరందరూ హాజరై సలహాలు సూచనలు  ఇవ్వవలసిందిగా కోరారు.  
 
 
స్థానిక గొల్లపాలెం గ్రామానికి చెందిన కొందరు మహిళలు మంత్రిని కలిశారు. తమ పత్రాలు అన్ని సక్రమంగా ఉన్నా తమ గ్రూప్ సబ్యులకు డబ్బులు పడలేదని, తమ గ్రామంలో ఆరు డ్వాక్రా గ్రూపులు ఉండగా 5 గ్రూపులకు డబ్బులు జమ కాబడ్డాయని కేవలం ఈ గ్రూపునాకు మాత్రమే డబ్బులు పడలేదని, మొదటి విడత పడలేదని, రెండవ విడత డబ్బులు పడలేదని బ్యాంకు నుంచి రిమార్కులు సైతం చూపలేదని ఆ మహిళలు మంత్రికి వారు తెలిపారు.  అందుకు సంబంధించిన జెరాక్స్ కాగితాలు తనకు అందచేయవల్సిందిగా ఆయన సూచించారు.  
 
 
 స్థానిక నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన మద్దెల పాండురంగారావు మంత్రిని కలిసి తమ ప్రాంతంలో గతంలో సంఘమిత్ర , క్రాంతి సంస్థలు నిర్మించిన గిరిజన కుటుంబాలకు చెందిన 157 గృహాలు పాడైయ్యాయని స్లాబు పెచ్చులు ఊడి పోతున్నాయని, గోడలు బీటలు ఏర్పడి ప్రమాదకరంగా మారేయని తెలిపారు.