గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2019 (17:13 IST)

టీడీపీపీలో మరో వికెట్ పడింది.. వల్లభనేని వంశీ గుడ్‌బై

పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. ఈయన కృష్ణ జిల్లా గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు. తద్వారా గత కొన్ని రోజులుగా పార్టీ మారబోతున్నారంటూ సాగిన ప్రచారానికి వంశీ దీపావళి రోజున తెరదించారు. 
 
తనను, తన అనుచరులను వైసీపీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వంశీ తన లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ఆయన తన లేఖలో తెలిపినట్టు సమాచారం. వంశీ ఇటీవలే సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన విషయం తెల్సిందే. దీంతో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. 
 
అటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితోనూ వంశీ సమావేశం కావడంతో ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారేమోనన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, వైకాపాలోకి వల్లభవేని వంశీ రాకను యార్లగడ్డ వెంకట్రావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వంశీ హయాంలో వైసీపీ కార్యకర్తలపై అనేక కేసులు నమోదయ్యాయని యార్లగడ్డ ఆరోపిస్తున్నారు.