1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 24 డిశెంబరు 2020 (23:06 IST)

శ్రీనివాసా... కరుణించావా.. స్థానికేతరులకు టోకెన్లు ఇచ్చేశారు.. పండగ!

శ్రీనివాసా.. శ్రీ వేంకటేశా.. నువ్వు స్థానికులకు మాత్రమే కనిపిస్తావా.. మాకు దర్సనమివ్వవా. ఎన్నో కిలోమీటర్ల నుంచి వస్తున్నాం. మాకు దర్సనభాగ్యం కలిగించవా అంటూ భక్తులు రోడ్డెక్కారు. పెద్దఎత్తున ఆందోళన చేశారు. అలిపిరి కేంద్రంగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో టిటిడి ఉన్నతాధికారులు సైలెంట్‌గా చూస్తూ ఉన్నారు.
 
కేవలం స్థానికులకు మాత్రమే దర్సన టోకెన్లని ముందుగా ప్రకటించారు. కానీ నిన్న అర్థరాత్రి నుంచి టోకెన్లను ప్రారంభించి స్థానికేతరులకు కూడా ఇచ్చేశారు. ఎవరు ఆధార్ కార్డ్ తీసుకొచ్చినా వారికి టోకెన్‌ను ఇచ్చింది టిటిడి. దీంతో భక్తులు ప్రశాంతంగా టోకెన్లను పొందారు.
 
ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఎంతోమంది తిరుపతిలో ఉండిపోయారు. అయితే నేటి నుంచి ఇస్తున్న టోకెన్లు తిరుపతి, తిరుమలలోని స్థానికులకు మాత్రమేనని చెప్పారు. దీంతో స్థానికేతరులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కానీ వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే వచ్చిన భక్తులకు టోకెన్లు ఇవ్వకుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని.. వారు ఆందోళనకు దిగే అవకాశముందని భావించారు టిటిడి ఉన్నతాధికారులు.
 
దీంతో అర్థరాత్రి నుంచే వారికి కూడా టోకెన్లను కేటాయించారు. రోజుకు 10 వేల టోకెన్ల లెక్కన పదిరోజుల పాటు లక్ష టోకెన్లను ఇస్తామని టిటిడి మొదట్లో చెప్పింది. కానీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒకేరోజు టోకెన్లను ఇచ్చేస్తోంది. ఇప్పటి వరకు 60 వేలకు పైగా టోకెన్లను ఒకేరోజు భక్తులు పొందారు. టైమ్ స్లాట్ బట్టి రేపటి నుంచి జనవరి 3వ తేదీ వరకు భక్తులు శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్సించుకోవచ్చు.