1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (09:57 IST)

ఉదయగిరి టిక్కెట్‌ను అమ్మకానికి పెట్టారు : సీఎం జగన్‌పై వైకాపా రెబెల్ ఎమ్మెల్యే

mekapati chandrasekhar reddy
లేనిపోని అనుమానాలతో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్‌ను అమ్మకానికి పెట్టారంటూ వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై  సిట్టింగ్ ఎమ్మెల్యే, వైకాపా రెబెల్ నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉదయగిరిలో తాను డబ్బులు తీసుకుంటున్నానంటూ జగన్ అన్నారని, సంపాదించడానికి ఉదయగిరిలో ఏముందని ప్రశ్నించారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అయినా తన గ్రాఫ్ బాగా లేదంటూ సీఎం జగన్ తనను కించపరిచారని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశానని అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, లేనిపోని అనుమానాలతో తన టికెట్నే సీఎం జగన్ అమ్మకానికి పెట్టారని, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని, ఆయన ఇక జన్మలో సీఎం కాలేరని విమర్శించారు. జగన్‌ను గెలిపించి తప్పు చేశామని మండిపడ్డారు. జగన్ లాంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజలు బాగుపడరని, సీఎం పదవి భగవంతుడు ఇచ్చిన వరమని గ్రహించాలని, జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరని ఆయన జోస్యం చెప్పారు. 
 
ఏపీలో అక్రమ కేసులు, అన్యాయాలను ఇక భరించలేమని వైసీపీ సర్కారుపై ఆయన ధ్వజమెత్తారు. బటన్లు నొక్కడమే లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఎలా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎటుచూసినా అభివృద్ధి కానరావడంలేదని, జగన్ చుట్టూ ఉండేవారు, సలహాదారులు ఎవరికివారే దోచుకుంటుకున్నారని ఆరోపించారు. కడపలో మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ రాజేశేఖర్ రెడ్డికి ఉన్న గుణాలేవీ జగన్‌ మచ్చుకైనా కనిపించవన్నారు. రుషికొండలో భవనాలను సరదాగా కట్టుకున్నట్లు అనిపిస్తోందని, నాయకుడికి తీవ్రమైన ధనదాహం ఉండకూడదని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆదరణ పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకుంటే ప్రజలు గుండు కొట్టించుకోవాల్సిందేనని ఆయన అన్నారు.