శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 6 మే 2019 (14:45 IST)

ఒక్క మిస్డ్‌కాల్‌తో పరిచయం.. వదిలించుకునేందుకు హత్య...

ఒక్క ఫోన్‌కాల్‌తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత ఆ యువతి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. చివరకు ఆ యువకుడు ఆ యువతిని వదిలించుకునేందుకు ఏకంగా ఆమెను అంతమొందించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన రేవూరి నాగరాణి అనే మహిళ భర్త ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలను ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించి... తాను మాత్రం కొండ్రపోలు గ్రామంలో నార్కట్‌పల్లి అద్దంకి వద్ద ఉన్న ఓ దాబాలో దినసరి కూలిగా నాగమణి జీవనం కొనసాగిస్తోంది. 
 
అయితే కొన్ని నెలల క్రితం తాండూరు కోటబాసుపల్లికి చెందిన గుర్రంపల్లి రాజుకు సెల్‌‌నెంబర్‌కు పొరపాటున నాగరాణి ఓ మిస్డ్‌కాల్ ఇచ్చింది. దీంతో రాజు తన మొబైల్‌ నుంచి తిరిగి ఫోన్ చేద్దామని భావించాడు. కానీ, అందులో బ్యాలెన్స్ లేకపోవడంతో తన స్నేహితుడు మంగలి తులసి ఫోన్ నుంచి తిరిగి నాగరాణి సెల్‌కు ఫోన్ చేశాడు. 
 
ఈ ఫోన్‌ను లిఫ్ట్ చేసిన నాగరాణి.. పొరపాటుగా తానే చేశానని చెప్పింది. దీంతో సరే అని రాజు ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత రోజు నుంచి తులసి నంబరుకు నాగరాణి ఫోన్ చేయడం మొదలుపెట్టింది. ఇదే అదునుగా భావించిన తలిసి.. నాగరాణితో చనువుగా మాట్లాడటం ప్రారంభించాడు. అలా వారిమధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇక పనిలో పనిగా మంగలి తులసి తన ఆర్థిక అవసరాల కోసం నాగరాణి వద్ద బంగారు గొలుసు తాకట్టు పెట్టి రూ.30 వేల నగదు తీసుకెళ్లాడు. 
 
అదేసమయంలో ఈ నగదు తిరిగి చెల్లించాలని, తనను పెళ్లి చేసుకోవాలని నాగరాణి తులసిపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఇక దీంతో నాగరాణిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న మంగలి తులసి మార్చి 26వ తేదీన జహీరబాద్‌ నుంచి కిష్టాపురం గ్రామానికి వచ్చి రాత్రి ఆమెతో గడిపాడు. అనంతరం సరదాగా మనం అలా అలా తిరిగొద్దామంటూ మార్చి 27వ తేదీన నాగరాణిని జనసంచారం లేని కంకరమిల్లు వెనక్కు తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. 
 
నెలరోజులుగా ఆ మృతదేహన్ని ఎవరు చూడకపోవడంతో అక్కడే కుళ్లిపోయి ఎముకలు తేలాయి. అయితే, తమ తల్లి నెల రోజుల నుంచి తమను చూసేందుకు రావడం లేదని భావించిన పిల్లలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నాగరాణి మొబైల్ నంబరు ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో తులసిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని వెల్లడించారు. అలా ఒక్క మిస్డ్‌కాల్ చివరకు ఓ మహిళ ప్రాణాలు బలగొనగా, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.