1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 31 డిశెంబరు 2021 (17:07 IST)

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మైండ్ పోయింద‌న్న తంగిరాల‌ సౌమ్య

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎపుడూ.... ప్రజల గుండె చప్పుడు జగన్ జ‌గ‌న్ ... అని భజనలు చేయడం కాద‌ని... దళిత జాతి గుండె చప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలుసుకోవాల‌ని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమ‌ర్శించారు.
 
 
ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి మైండ్ పోయింద‌ని, కనీస పరిజ్ఞానం లేని వారిని ప్రజా ప్రతినిధులను చేస్తే ఇలాంటి వ్యాఖ్యలే చేస్తార‌ని సౌమ్య ఎద్దేవా చేశారు. ప్రజలు మనల్ని ఎన్నుకునేది చట్టసభలలో ప్రజా సమస్యలపై మన గళం వినిపించడానికే కానీ, నాయకులకు భజన చేయడానికి కాద‌న్నారు. 
 
 
శ్రీదేవి గారు మీరు ఎమ్మెల్యే అవ్వడానికి హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారని తెలుసుకోండి. అణచివేయబడుతున్న మహిళల హక్కుల కోసం తన న్యాయ శాఖ మంత్రి ప‌ద‌వికి  రాజీనామా చేసిన వ్యక్తి పై మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు. రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలున్నాయి. ఉండవల్లి శ్రీదేవి మానసికస్థితి సరిగా లేనట్లు ఉంద‌ని తంగిరాల సౌమ్య వ్యాఖ్యానించారు. 
 
 
మీ నియోజకవర్గ సమస్యల పై మిమ్మల్ని ఓట్లు వేసిన గెలిపించిన మీ ప్రజల ప్రజాసమస్యలపై పోరాడండి కానీ, ఏదో ప్రైవేట్ సభలలో నోటికి ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సరికాద‌న్నారు. వెంటనే ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల‌ని, బహిరంగంగా దళిత జాతికి ఆమె క్షమాపణ చెప్పాల‌న్నారు. 
 
 
కృష్ణా జిల్లా నందిగామలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దళితుల ఆరాధ్య దైవం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి న‌మ‌స్క‌రిస్తూ, తాడికొండ ఎమ్యెల్యే  ఉండవల్లి శ్రీదేవిపై విరుచుకుప‌డ్డారు. ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.