మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (11:24 IST)

పంచాయతీ ఎన్నికలు : టీడీపీ బలంతో గెలిచి వైకాపాలో జంప్

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే రెండు దశలు ముగిసిపోయాయి. బుధవారం మూడో దశ పోలింగ్ జరుగనుంది. అయితే, తొలి, రెండు దశల ఎన్నికల్లో గెలుపొందిన పలువురు అభ్యర్థులు వైకాపాలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా, తెలుగుదేశం పార్టీ బలం, మద్దతుతో గెలుపొంది, ఇపుడు అధికార పార్టీలోకి దూకేస్తున్నారు. 
 
తాజాగా నెల్లూరు జిల్లాలో ఈ వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జిల్లాలోని ఆత్మకూరులో రెండో విడతలో భాగంగా శనివారం ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. 
 
సంగం మండలం చెర్లోవంగుల్లులో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పి.రఘురామయ్య అనుచరుడు కె.రామయ్య సర్పంచ్‌గా విజయం సాధించారు. అనంతరం మాజీ సర్పంచ్‌తో కలిసి ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మంత్రి గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇద్దరూ వైసీపీలో చేరారు. 
 
అదేవిధంగా ఏఎస్‌పేట మండలం పెద్దబ్బీపురానికి చెందిన ఎ.మాధవరెడ్డి టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. ఆదివారం ఆయన మంత్రి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
ఇదే మండలంలోని చౌటభీమవరం సర్పంచ్‌గా టీడీపీ మద్దతుతో విజయం సాధించిన లక్ష్మీనారాయణ కూడా వైసీపీలో చేరడం గమనార్హం. దీంతో వారి గెలుపునకు కృషి చేసిన టీడీపీ శ్రేణులు విస్తుపోతున్నాయి.