1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (09:59 IST)

భర్తతో భార్యకు మత్తుమందిచ్చి ఆపై అత్యాచారం చేసిన మిత్రుడు.. ఎక్కడ?

ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన లింగసముద్రం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. తన భర్తకు తాగుడుకు బానిసయ్యేలా చేయడంతో పాటు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అందుకే తామిద్దరం చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ బాధితులు ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను తీసుకున్నారు. ఓ లేఖ కూడా రాశారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 'నా చావుకి, నా భర్త చావుకి కారణం షేక్‌ ఇలియాజ్‌. నా భర్త తాగుడికి బానిసయ్యేలా చేశాడు. ఆయన ద్వారా నాకు మత్తు మందు ఇచ్చి స్పృహతప్పి పడిపోయిన తర్వాత పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని నెట్‌లో పెడతానని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మేమిద్దరం చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా చావు తర్వాత అయినా అతడికి శిక్ష పడుతుందని కోరుకుంటున్నాం' అని బాధితురాలు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొంది. 
 
ఆ తర్వాత దంపతులిద్దరూ పురుగుల మందు తాగారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ముందు దంపతులిద్దరూ సెల్ఫీవీడియో ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. నిందితుడు వారిని ఎలా బ్లాక్‌  మెయిల్‌ చేసిందీ వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.