1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Night Cufew in Andhra Pradesh Extended another 14 Days

ఆంధ్రాలో నైట్ కర్ఫ్యూ పొడగింపు.. ఎప్పటివరకు అంటే...

Andhra Pradesh
ఏపీ ప్రభుత్వం మరోమారు రాత్రిపూట అమల్లో వున్న కర్ఫ్యూను పొడగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు మరో 14 రోజుల పాటు అమల్లోనే ఉంటాయని తెలిపింది. కోవిడ్‌ మార్గదర్శకాలను విధిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
అయితే ఇప్పటికే.. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను జగన్‌ ఆదేశించారు.వి జయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించాలనుకున్న పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని స్పష్టం చేశారు. 
 
మరోవైపు, రాష్ట్రంలోని జిల్లాల్లో పలు జిల్లాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో పాజిటీవ్ కేసులు పెరుగుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో అధికారులు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దీంతో చాలా మంది స్వచ్చంధంగా వచ్చి టీకాలు వేయించుకుంటున్నారు. 
 
మొదట్లో వ్యాక్సిన్ వేయించుకోడానికి భయపడిన వారు కరోనా కేసులు పెరుగుతుండడంతో టీకాలు వేయించుకుంటున్నారు. అంబాజీపేట మండలంలో, మాచవరం, పుల్లేగుర్రు, దంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామాల్లో కర్ఫ్యూ అమలవుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరవడానికి అనుమతి ఇచ్చారు. 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతోంది. 
 
కోనసీమలోని రాజోలు నియోజకవర్గంలో తాటిపాక మఠంలో కర్ఫ్యూ అమలవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 175 కట్టడి ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. కరోనా కేసుల నమోదులో ఈ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.
తర్వాతి కథనం
కేటీఆర్​ను ఆశ్రయించిన రష్మీ గౌతమ్: వీధికుక్కలను ఆపరేషన్‌ చేసి..?