శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (22:40 IST)

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి శుక్రవారం నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈయన్ను తొలగించే నిమిత్తం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏకంగా కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఎస్ఈసీ పదవీకాలాన్ని ఆరేళ్ల నుంచి మూడేళ్ళకు తగ్గించింది. అలా అడ్డదారిన రమేష్ కుమార్‌ను తప్పించింది. 
 
ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆర్డినెన్స్‌పై బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించారు. ఆర్డినెన్స్‌తో పాటు... ఎస్ఈసీ తొలగింపునకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అన్ని రకాల జీవోలను కొట్టివేసింది. 
 
దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడంతో పదవి బాధ్యతలు స్వీకరిస్తూ ఎన్నికల కమిషనర్‌ ప్రకటన విడుదలైంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 
 
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న నిమ్మగడ్డ రెండ్రోజుల్లో విజయవాడకు రానున్నారు. కాగా.. ఈ తీర్పుతో గత కొన్ని రోజులుగా మూతపడిన ఏపీఎస్‌ఈసీ కార్యాలయం మళ్లీ తెరుచుకోనుంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించిన తర్వాత ఏపీ ఎస్‌ఈసీ కార్యాలయానికి సాధారణ పరిపాలనా శాఖ సీల్ వేసింది. అయితే సోమవారం ఆఫీస్ తెరుచుకోనుంది. 
 
కాగా, ఈ హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ స్పందిస్తూ, గతంలో మాదిరిగానే నిష్పాక్షికంగా బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. అన్నిరాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. వ్యక్తులు కాదు.. రాజ్యాంగ సంస్థలు, విలువలు శాశ్వతమన్నారు. రాజ్యాంగ సంస్థ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు.