శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (15:27 IST)

అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలే : జీవీఎల్

అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించింది. దీనిపై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఆర్డినెన్స్‌ను కొట్టివేసింది. పైగా, ఎస్ఈసీగా మళ్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌నే కొనసాగించాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ తీర్పుపై జీవీఎల్ స్పదించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయన్న విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తెరగాలని హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు పరిమితమైన అధికారాలే ఉంటాయని, అన్నీ తామై వ్యవహరించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అన్నారు.
 
ఎన్నికల కమిషనర్ హోదాలో రమేశ్ కుమార్ కూడా ఏ రకంగా, ఏ పార్టీకి అనుకూలంగా లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికలు వాయిదా వేసే వరకు రమేశ్ కుమార్ తీరు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు ఆరోపణలున్నాయని, ఆ తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న అనుమానాలు కలిగాయని జీవీఎల్ పేర్కొన్నారు.
 
అయితే రాజ్యాంగ పదవిలో ఉండేవారు రాజ్యాంగ స్ఫూర్తిని నిలపాల్సిన బాధ్యతను గుర్తించాలని,  రమేశ్ కుమార్ కూడా భవిష్యత్తులో అన్ని పార్టీలకు అతీతంగా రాజ్యాంగ విలువలకు లోబడి పనిచేస్తే బాగుంటుందని హితవు పలికారు. 
 
అలాగే, మరో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందిస్తూ, ఏపీ ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కొనసాగవచ్చంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల సుజనా హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని హైకోర్టు తీర్పు నిలబెట్టిందన్నారు. ఏపీ సర్కారు ఇప్పటికైనా తప్పు తెలుసుకుని కోర్టు తీర్పును గౌరవించాలని సుజనా హితవు పలికారు.