గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (12:49 IST)

ఈ తీర్పు ప్రజాస్వామినికి ఊపిరి.. పవన్ : న్యాయం - చట్టం గెలిచింది.. కేశినేని

రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగిస్తూ ఏపీ సర్కారు తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తూ, ఎస్ఈసీగా తిరిగి నిమ్మగడ్డను నియమిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. 
 
'రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది' అని ఆయన పేర్కొన్నారు. 
 
అలాగే, టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ, హైకోర్టు తీర్పు హర్షణీయమన్నారు. 'న్యాయం గెలిచింది. చట్టం గెలిచింది. ప్రజాస్వామ్యం గెలిచింది. రాజ్యాంగం గెలిచింది. న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడింది' అని కేశినేని నాని ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్‌ను ముఖ్యమంత్రి జగన్, వైసీపీలకు జత చేశారు.
 
కాగా, ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీ రమేశ్ కుమార్‌ను తొలగించడాన్ని హైకోర్టు రాజ్యాంగ వ్యతిరేక చర్యగా స్పష్టంచేసింది. ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తున్నట్టు తీర్పును వెలువరించింది. అన్ని జీవోలను కొట్టివేస్తున్నట్టు ప్రకటించిన హైకోర్టు.. రమేశ్ కుమార్‌ను తిరిగి ఎస్ఈసీ‌గా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.