గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మే 2020 (10:24 IST)

పుల్వామా తరహా దాడికి యత్నం.. 20 కిలోల పేలుడు పదార్థాలు నిర్వీర్యం

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఆర్మీని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపుతున్నారు. ఇటీవల పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పుల్వామా తరహా దాడి ఘటనకు ఉగ్రవాదులు మరోసారి కుట్ర చేశారు. 
 
ఈ భారీ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడంతో జమ్మూ కాశ్మీర్‌లో భారత సైన్యానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం పుల్వామా జిల్లాలోని రాజ్‌పోరాలో ఐఈడీ బాంబులతో నిండి ఉన్న కారును సీజ్ చేశారు. వాటిని నిర్వీర్యం చేసి పేలుడు ముప్పును తప్పించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ముష్కరుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
 
భారత ఆర్మీ కాన్వాయ్ వెళ్లే మర్గమైన అయెన్‌గుండ్ ప్రాంతంలో ఓ సాంట్రో కారు అనుమానస్పదంగా కనిపించింది. వెంటనే దాన్ని ఆపిన భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. దాంట్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు కనిపించాయి. వెంటనే వాటిని నిర్మూలన చేశారు. ఆ కారును హిజ్బుల్ ఉగ్రవాది ఒకరు నడుపుతున్నట్టుగా అధికారులు తెలిపారు. 
 
సుమారు 20 కిలోల పేలుడు పదార్ధాలతో వెళ్తున్న ఓ వాహనాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో వెళ్తున్న ఓ వాహనాన్ని అడ్డుకోవడంతో ఇంత మొత్తం పేలుడు పదార్థాలను ఆపగలిగామని చెప్పారు. 
 
బారికేడ్లను ఢీకొట్టి ఆ వాహనం ముందుకు వెళ్లిందని ఆ సమయంలో సెక్యూర్టీ దళాలు ఫైరింగ్‌కు దిగాయని వెల్లడించారు. భద్రతా బలగాలు కారును ఆపిన వెంటనే కాల్పులు జరుపుతూ అతడు తప్పించుకున్నాడు. వెంటనే ముష్కరుల కోసం గాలింపు మొదలుపెట్టారు.