శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (08:59 IST)

పొలంలోకి గొర్రెలు వచ్చాయని... వైకాపా నాయకుడి దౌర్జన్యం... యువతులపై దాడి...

attack
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. తన పొలంలోకి గొర్రెలు వచ్చి పంటనుపాడు చేశాయని ఒక వైకాపా నాయకుడు ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, మరో వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం మొర్సపూడిలో జరిగింది. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గ్రామానికి చెందిన పి.నాగమణి గొర్రెలు ఆంజనేయులు (వైకాపా బలపరిచిన పంచాయతీ వార్డు సభ్యుడి) మొక్కజొన్న తోటలోకి వెళ్లాయి. గొర్రెలు చేలో మేశాయని ఆంజనేయులు ఆమెను నిలదీశారు. దీంతో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. ఆంజనేయులు నాగమణిపై చెయ్యి చేసుకున్నారు. విషయాన్ని ఆమె దేవరగుంటకు చెందిన నాగరాజు అనే వ్యక్తికి చెప్పటంతో మరోసారి గొడవ మొదలైంది. 
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆంజనేయులు నాగరాజును కొబ్బరిమట్ట విరిగేదాకా కొట్టారు. అక్కడే ఉన్న పెద్ద కర్ర తీసుకుని దాడికి తెగబడ్డారు. అడ్డొచ్చిన మహిళతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలను.. విచక్షణారహితంగా చితకబాదారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమణి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. 
 
ఆంజనేయులు కూడా నాగమణి, మరో వ్యక్తి పైన ఫిర్యాదు చేశారని, ఇద్దరి ఫిర్యాదులు తీసుకున్నామని రూరల్‌ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. అయితే, తొలుత గొర్రెల కాపరులే రైతుపై దాడి చేశారన్న ప్రచారం జరిగినా వైకాపా నాయకుడే మహిళ, ఆమె ఇద్దరు ఆడపిల్లపై దాడి చేసినట్లుగా ఉన్న వీడియో వైరలయింది.