1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (10:46 IST)

ప్రత్యేక హోదా కోసం టీడీపీ మహిళా నేత కుమారుడి ఆత్మహత్య!

విభజన హామీ మేరకు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా టీడీపీ మహిళా నేత కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని శ్రీరామపురంలో ఉదయభాను అనే వ్యక్తి హోదా కోసం తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఉదయభాను గుడివాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు తులసీరాణి కుమారుడు కావడం గమనార్హం. 
 
పాలిటెక్నిక్ చదువుకున్న ఉదయభాను, ప్రస్తుతం ఓ రేషన్ షాపు నడుపుతున్నాడు. మరణించే ముందు ప్రత్యేక హోదా కావాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని సూసైడ్ నోట్ రాశాడు. నిరుద్యోగ సమస్య తీరాలని, ఈ లేఖ తన మరణవాగ్మూలమని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయభాను మరణంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.