1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 24 డిశెంబరు 2021 (10:54 IST)

ఆన్లైన్ మ్యారేజ్ బ్యూరో వెబ్ సైట్ల దోపిడీ... డ‌బ్బు గుంజేస్తున్న మోస‌గాళ్ళు!

ఆన్లైన్ మ్యారేజ్ బ్యూరోల ద్వారా అనేక రకలుగా మోసాలు జరుగుతున్నాయ‌ని, వాటిని వెంట‌నే నిషేధించాల‌ని ప‌లువురు డిమాండు చేస్తున్నారు. ఈ మ్యారేజ్ బ్యూరోల అరాచ‌కాల వ‌ల్ల ప‌లు  సంసారాలు ఆర్ధికంగా, సాంఘికంగా అనేక విధాలుగా సంక్షోభంలో ప‌డుతున్నాయి.
 
 
అనేక ఆన్లైన్ బ్యూరోలకి కొన్నింటికి రిజిస్ట్రేషన్ ఫీజులు ఉండగా, కొన్నింటికి జీరో ఫీజులు అంటూ మోసం చేస్తున్నారు. వెబ్ సైట్లలో ఆకర్షణీయమైన ఫోటోలు, వ్యాఖ్యలు జోడించి మరీ ఈ వెబ్ సైట్లు తెరిచి లబ్ది పొందుతున్నాయి. కొందరు బాధిత తలిదండ్రులు, సాంఘిక నిపుణులు మాత్రం ఇదొక సాంఘిక సైలెంట్ టెర్రరిజం అని వర్ణిస్తున్నారు.
 
 
ఎవరో తెలియదు, ఏకులమో తెలియదు, పెళ్లి కాని యువతి యువకులు ఒకరికొకరు నిజంగా  ఏమి చేస్తున్నది తెలియదు, వారి సామాజిక స్థితి ,కుటుంబ నేపధ్యం,  ఒకరికొకరు వ్యక్తిగత నడవడిక గుణం, శీలం అసలు ఇంకా లోతుగా వెళితే వారిలో కొందరికి అప్పటివరకు పెళ్లి అయి పిల్లలున్నవారు కూడా ఈ ఆన్లైన్ బ్యూరోలో సభ్యుల ఉంటున్నారనేది కూడా తెలియదు. అసలు సామాజిక స్టేటస్ ఉన్నవారెవరు వీటిల్లో ఫోటోలు పెట్టరు. తమతమ కులపు పెళ్లి పెద్దల ద్వారా, లేదా పరిచయమున్న పెళ్లిళ్ల పేరయ్య‌ల ద్వారా మాత్రమే సంబంధాలు చూస్తారు. 
 
ఇటీవల పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో  పంచరంగుల ఇల్లు,హోదా ఉన్నట్లు తెలిపే ప్రొఫైల్ వీడియోలను ఎవరివో ఎక్కడివో తీసి కూడా అప్లోడ్ చేసి ఏదో ఒక గొప్ప కుటుంబం నుండి వచ్చి నట్లు ఎంతో అస్తిపాస్తులు ఉన్నట్లు మ‌భ్య‌పెడుతున్నారు. ఈ వివాహ వేదికలు నిరాధారంగా వెసులుబాటు కల్పించటం, వీడియా కాన్ఫరెన్సుల ద్వారా ఒకరికొకరు మాట్లాడుకోవడం, పరిచ‌యం అయ్యాక అత్యంత తీపిగా నావాళ్ళు నీవాళ్ళు, నీవాళ్ళు నా వాళ్ళు అంటూ, ఒకరి కష్టం మరొకరిది లాంటి మోసపుకబుర్లతో కొందరు యువతీ యువకులైన మోసగాళ్లు చెప్పే మాటలతో ఒకరినొకరిని విడదీయలేని బంధంగా పెళ్లికి ముందే, అసలు ఒకరినొకరు చూసుకోకముందే సాగుతుంది.
 
 
ఇక అక్కడ నుండి ఒకరి కష్టాలు, అవసరాలు ఒకరికొకరు చెప్పుకోవడం, తద్వారా ఒకటి కాబోతున్నామని భ్రమలో పెట్టి, నమ్మబలికి చివ‌రికి న‌ట్టేట ముంచుతున్నారు. ద‌క్కిన కాడికి ఎదుట వారిని పిండేయటం,  పుట్టినకాడికి అప్పోసప్పో తెచ్చి ఇచ్చి, తీరా తిరిగి ఇవ్వమని అడిగే నాటికి పరారు అవ్వటం ఇదీ తంతు. అధిక శాతం ఆన్లైన్ మాట్రిమోనియల్స్ ద్వారా ఇలా మోసాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికి వాటిని నిరోధించే చ‌ర్యలు లేవని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
 
 
ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాకు చెందిన ఒక యువతి కర్నూలు జిల్లాకు చెందిన ఒక ఇద్దరు పిల్లలున్న వివాహితుడి వలలో చిక్కుకోగా ఆ కుటుంబం ఇప్పుడు  విలవిలలాడుతోంది. ఆన్లైన్ మాట్రిమోనిలో ఫోటో పెట్టిన ఆ మోసగాడు, తాను ఫలానా అగ్రకులం లో పుట్టిన పెద్ద టెక్స్టైల్ వ్యాపారిని అని తన ప్రొఫైల్ ఆ మాట్రిమోనిలో పెట్టాడు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మ‌రో యువతి పూర్తిగా వాడి మాటలు నమ్మి వాడి వలలో చిక్కుకుంది. తనకు తలిదండ్రులు లేర‌ని, నీ తల్లిదండ్రులే నాకు తలిదండ్రులు, వారిని ఏలోటు రాకుండా చూసుకోవడం మన కర్తవ్యం లాంటి మోసపు కబుర్లు చెప్పి వాడు నిదానంగా అమె నుండి డబ్బు గుంజటం మొదలెట్టాడు. 
 
 
ఇన్కమ్ టాక్స్ కట్టాలని, సరుకు వ‌చ్చింది, డ‌బ్బు కట్టాలంటూ అందినంతా లాగేశాడు. వర్క్ టూ హోమ్ లో స్వంత పట్టణంలో ఉన్న ఆమె వాడి మాటలు నమ్మి ఈజీ మనీ,హెచ్ డి ఎఫ్ సి లాంటి ఆర్ధిక సంస్థల్లో ఆన్లైన్ ద్వారా 40 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకుని వాడికి పేటిఎం ద్వారా డబ్బు పంపింది. బ్యాంకుల నుండి తిరిగి చెల్లింపులు ఒత్తిడి పెరగటంతో వాడిని అడగ్గా జంప్ అయ్యాడు. తీరా బంధువులు కర్నూల్ వెళ్లి వాడి అడ్రెస్సులో విచారించగా, వాడి మీద రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల‌లోనూ కేసులు ఉన్నాయని పోలీసులు   వస్తున్నట్లు చెప్పారు. పైగా పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్న వాడు ఆ కులమే కాదని చెప్పారని బంధువులకు చెప్పారట. ప్రస్తుతం ఆ కూతురుపై ఆధారపడి ఉన్న ఆ కుటుంబం 40 లక్షల రూపాయ‌ల అప్పులతో ఏమి చెయ్యాలనే ఆవేదనతో కుంగిపోతున్నారు.
 
 
అసలు ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలకి వీలు కలిగించేలా ఆన్ లైన్ మోసాలు సాగుతుంటే, ఎందరో అమాయక యువతీ యువకుల జీవితాలతో ఆటలాడుకునే ఆన్లైన్ మాట్రిమోనియల్స్ ని నిషేధించాలని డిమాండు చేస్తున్నారు. అలాంటి అడ్డగోలు వ్యవహారాలకు అవకాశమిస్తున్నసంస్థలకు, సినిమా నటులు , ఇతర ప్రముఖులు ప్రకటనలతో నటించటం ద్రోహం అని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  ఇక‌నైనా అమ్మాయిలు, అబ్బాయిలు, వారి త‌ల్లితండ్రులు జాగ్ర‌త్త‌గా ఉండాలి.