బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (11:47 IST)

ఫిబ్రవరి ఒకటి నుండి అంగన్‌వాడీ కేంద్రాల ప్రారంభం: రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ

కరోనా పరిస్ధితుల నేపధ్యంలో విరామం ప్రకటించిన అంగన్‌వాడీ కేంద్రాలను ఫిబ్రవరి 1 నుండి తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కంటైన్మెంట్  జోన్ల వెలుపల అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించవచ్చని నిర్దేశించగా, సుప్రీం కోర్టు సైతం ఇదే విషయంపై స్పష్టత ఇచ్చారని వివరించారు.

గర్భిణీ, పాలిచ్చే మహిళలు, 6-72 నెలల వయస్సు పిల్లలకు 23.03.2020 నుండి 31.01.2021 వరకు టేక్ హోమ్ రేషన్ అందించామని, తాజా పరిస్ధితుల నేపధ్యంలో పూర్తి స్దాయి సమక్ష తదుపరి కరోనా మార్గదర్శకాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు.

36 నుండి 72 నెలల వయస్సు కలిగిన ప్రీ-స్కూల్ పిల్లలకు మిడ్ డే భోజనం అందిస్తామని,  ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య, అరోగ్య పరమైన జాగ్రత్తలతో కేంద్రాలు పనిచేస్తాయని డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు.
 
6 నుండి 36 నెలల వయస్సు గల పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న విధానమే కొనసాగుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిసరాల్లో పరిశుభ్రత ఉండేలా చూడాలని ఆదేశించామని, అంగన్‌వాడీ వర్కర్స్, సహాయకులు తప్పని సరిగా ముఖముసుగు ధరించవలసి ఉంటుందని,  మార్గదర్శకాల ప్రకారం తరచుగా చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించటం తప్పనిసరన్నారు. 

పిల్లల టీకాల విషయంలో షేడ్యూలు అత్యంత కీలకమైనది కాగా, ఈ అంశాలకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.  ఆన్‌లైన్ విధానంలో పాఠశాల విద్య జరుగుతున్నప్పటికీ , చిన్నారులు అంగన్ వాడీ కేంద్రాలను సైతం సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. 
 
తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లలు, అధిక ప్రమాదం ఉన్న గర్బిణిలు. పాలిచ్చే తల్లులను ఖచ్చితంగా పర్యవేక్షిస్తామని, ఇంటి ఆధారిత సేవ, వండిన ఆహారాన్ని వారి ఇంటికే చేర్చేలా చర్యలు కొనసాగుతాయన్నారు.

అన్ని రకాల కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని, మరోవైపు కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారి సమాచారాన్ని తక్షణమే వైద్యులకు అందిస్తూ, వారిని ఇంటికి పంపి వేస్తామని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.