గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2023 (15:00 IST)

కారును ఢీకొన్న గూడ్సురైలు - ఆ నలుగురికి ఆయువు మూడిందనుకున్న క్షణంలో..

car accident
విశాఖలో పెనుప్రమాదం తృటిలో తప్పింది. రైలు పట్టాలు దాటుతున్న కారును గూడ్సు రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. నిజానికి ఆ నలుగురికి ఆయువు మూడిందనుకునే సమయంలో అద్భుతం జరిగింది. గూడ్సు రైలు లోకోపైలెట్ వేగాన్ని తగ్గించడంతో కారులోని ప్రయాణికులు డోర్లు తెరుచుకుని బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ, గూడ్సు రైలు ఢీకొనడంతో కారు మాత్రం నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటన విశాఖపట్టణంలోని షీలా నగర్ పోర్టు రోడ్డులో మంగళవారం అర్థరాత్రి సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 
 
విశాఖపట్టణానికి చెందిన రిటైర్డ్ నేవీ అధికారి కుటుంబ సభ్యులు ఈ దారుణ అనుభవం ఎదుర్కొన్నారు. మృత్యు అంచుల వరకు వెళ్లి వచ్చారు. అయితే, బాధిత కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు పోలీసులు ఈ వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే, పోలీసులు ఎంత గోప్యంగా ఉంచినప్పటికీ ఈ వివరాలను వెలుగులోకి వచ్చాయి. నేవీ విశ్రాంత అధికారి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీహరిపురం నుంచి విశాఖ సిటికీ బోలెనో కారులో వస్తున్నారు. 
 
షీలా నగర్ పోర్ట్ రోడ్ మారుతి సర్కిల్ వద్ద లూప్ లైనును క్రాస్ చేస్తుండగా కారు ఉన్నట్టుండి మొరాయించింది. సరిగ్గా పట్టాలపైకి వచ్చి ఆగిపోయింది. ఆ సమయంలో గూడ్సు రైలు అదే ట్రాక్‌పై వేగంగా వస్తుంది. పట్టాల మధ్య కారు ఆగిపోవడాన్ని గమనించిన లోకో పైలెట్ రైలు వేగాన్ని తగ్గించారు. దీంతో కారులోని ప్రయాణికులంతా డోర్లు తెరుచుకుని బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. 
 
రైలును ఆపేందుకు లోకో పైలెట్ బ్రేకులు వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గూడ్సు రైలు వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయిపోయింది. ఈ ఘటనకు సంబంధించి గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.