1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (07:16 IST)

కాల్షీట్లు ఖాళీ లేకపోవడంలో ఆంధ్రప్రదేశ్‌కు పవన్ రావడం లేదు: వుండవల్లి శ్రీదేవి

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సినీ నటుడు పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వుండవల్లి శ్రీదేవి డిమాండ్ చేశారు. సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌కు ఆన్ లైన్‌టికెటింగ్‌తో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం కేవలం పోర్టల్ ను మాత్రమే నడుపుతోందని.. టికెట్లను థియేటర్ల వాళ్లు అమ్ముకుంటారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు గ్రహించలేకపోయారని ఎద్దేవా చేశారు. టికెట్ల ధరను నియంత్రించేందుకు ఆన్‌లైన్ విధానం
 
సినిమా టికెట్ల ధరను ఇష్టానుసారంగా పెంచేసి.. ప్రజలపై భారం వేస్తే చూస్తూ ఉరుకోవాలని ఎమ్మెల్యే శ్రీదేవి ప్రశ్నించారు. టిక్కెట్ల ధరలో విషయంలో నియంత్రణ లేకుండా పోతోందని..ఈ ఆన్‌లైన్ విధానాన్ని డిస్ట్రిబ్యూటర్లే అడిగారన్నారు. ఆన్‌లైన్ టికెట్ విధానం అమల్లోకి వస్తే..బ్లాక్‌లో అధిక రేట్లకు టికెట్లు అమ్ముకునే అవకాశం ఉండదనే  ఆక్రోశంతో పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

2003 నుంచే సినీ పరిశ్రమ పెద్దలు ఆన్‌లైన్ టికెట్ విధానం ప్రవేశపెట్టాలని కోరుతున్నారన్నారు. ఈ నెల 20న సినీ పరిశ్రమ పెద్దలు సీఎం జగన్ ని కలిసి అత్యంత పారదర్శకమైన ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని కోరారు.

ఆన్ లైన్ విధానం ద్వారా థియేటర్లు అమ్మడం ద్వారా ఆ మరుసటి రోజు నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, థియేటర్ యజమానులు వారి వారి ఖాతాల్లో నగదు జమ అవుతోందన్నారు. దీంతో జీఎస్టీ, వినోద్ పన్ను రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి చేరాల్సిన పన్ను మొత్తం జమ అవుతోందన్నారు..

కాల్షీట్లు ఖాళీ లేకపోవడంలో ఆంధ్రప్రదేశ్‌కు పవన్ రావడం లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు మానేసి హైదరాబాద్‌లో కూర్చోని సినిమాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల గురించి పట్టించుకునే సమయం పవన్ కళ్యాణ్ కు లేదని... కేవలం సీఎం జగన్‌ను విమర్శించడానికి సినిమా ఆడియో ఫంక్షన్ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం దారుణమని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానికి సమయం లేదని.. కేవలం తన స్వలాభం కోసం సినిమా వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు. సీఎం జగన్ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉరుకోరని ఎమ్మెల్యే శ్రీదేవి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు చోట్లు పోటీచేసి ఓడిపోయిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎమ్మెల్యే శ్రీదేవి గుర్తు చేశారు..