1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 సెప్టెంబరు 2021 (10:44 IST)

Gulab cyclone landfall: తీరం దాటిన గులాబ్ తుపాను

గులాబ్ తుపాను శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మధ్య తీరం దాటిందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో ఎపి వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉత్తరాంధ్రలో ఎక్కడికక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
 
గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూసపాటిరేగ, భోగాపురంలోని తీరప్రాంతాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. ముక్కాంలో సముద్రం 50 మీటర్లు ముందుకొచ్చింది. విజయనగరం ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
 
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రతీర ప్రాంతాల్లో రెడ్‌ అలెర్టు ప్రకటించారు. కళింగపట్నం, విశాఖ, గంగవరం పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.
 
వర్షం అతి భారీగా పడనుందని, పాత భవనాల్లో ఉన్నవారిని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపటుం జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సముద్రంలోకి మత్స్యకారులు మరో రెండు రోజుల వరకూ వెళ్లద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
మత్స్యకార గ్రామాలకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. కవిటి మండలం చిను కర్రివానిపాలెం, ఇద్దివానిపాలెం, విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంలో సముద్రం 50 మీటర్లు ముందుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో 66.25 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
 
గార మండలం కళింగపటుంలో అత్యధికంగా 125.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గార, శ్రీకాకుళం, నరసనుపేట, కోటబమ్మాళి, ఎచ్చెర్ల, జలుమూరు, పోలాకి మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, ఈ ప్రాంతాల్లోనిలోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
 
బలంగా వీస్తోను ఈదురుగాలలు ధాటికి పలాస మున్సిపాలిటీలోని రాజాం కాలనీ, శ్రీకూర్మం రోడ్డు మార్గంలో, మందస మండలం గంగువాడలో చెట్లు నేలకొరిగాయి. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట, బైపల్లి, ఎల్‌.డి.పేట, మెట్టూరు, పూడిలంక గ్రామాలకు చెందిన 182 మందిని సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు.