1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (16:49 IST)

వందేమాతరంకు ఉన్నంత శక్తి జై తెలంగాణకు ఉంది : పవన్ కళ్యాణ్

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ చేసిన జై తెలంగాణ నినాదం దేశ స్వాతంత్ర్యం సమయంలో చేసిన వందేమాతరం నినాదం కంటే పవర్‌ఫుల్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ చేసిన జై తెలంగాణ నినాదం దేశ స్వాతంత్ర్యం సమయంలో చేసిన వందేమాతరం నినాదం వంటిదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలో రెండో రోజు "చలో రే చల్‌" యాత్రలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ కరీంనగర్‌లో మూడు జిల్లాల నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కరీంనగర్‌లోని శుభం గార్డెన్‌లో పవన్‌ ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తెలంగాణకు తాను చివరి శ్వాస వరకూ రుణపడి ఉంటానన్నారు. వందేమాతరం పదానికి ఉన్నంత శక్తి జై తెలంగాణకు ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు. ఇందులో ముఖ్యంగా కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని సమాజం, అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. మార్చి 14లోపు పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
 
కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మనిచ్చారని ఆయన మరోసారి గుర్తుచేశారు. పునర్‌జన్మ ఇచ్చిన తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. జనసేన పార్టీ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వస్తోందని.. అది కూడా కరీంనగర్ నుంచి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు ఏ ఒక్కరితోనూ వ్యక్తిగత ద్వేషాలు లేవని చెప్పిన ఆయన విధానాల పరంగానే తానెవరితోనైనా విభేదిస్తానన్నారు. రాజకీయాలలోకి కొత్తరక్తం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.