1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 మే 2022 (17:27 IST)

ఎన్నికల పొత్తులపై ఏదో ఒక అద్భుతం జరుగుతుంది : పవన్ కళ్యాణ్

pawan kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, జనసేనస బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదరవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని గతంలో పవన్ స్పష్టం చేశారు కూడా. ఇపుడు మరోమారు ఆయన పొత్తులపై స్పందించారు. పొత్తులపై ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఆయన చెప్పారు. 
 
జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన ఆదివారం నంద్యాల జిల్లా శిరివెళ్ళ మండలం, గోవిందపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. 
 
ఆ తర్వాత ఆయనను మీడియా ప్రతినిధులు టీడీపీతో పొత్తు అవకాశాలపై ప్రశ్నించారు. పొత్తుపై టీడీపీ వైపు నుంచి ఆహ్వానం వస్తే ఎలాంటి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దీనికి పవన్ బదులిస్తూ.. బలమైన ఆలోచనా విధానంతో ముందుకు వెళతామని చెప్పారు. రాష్ట్ర ప్రజల క్షేమం, రాష్ట్ర భవిష్యత్తుకు జనసేన అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 
 
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని భావిస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. బీజేపీతో తమ భాగస్వామ్యం అమోఘమైన రీతిలో ఉందని, రోడ్ మ్యాప్‌కు సంబంధించిన విషయాలను తగిన  సమయంలో వెల్లడిస్తామని చెప్పారు.