శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 1 నవంబరు 2018 (18:48 IST)

తెలంగాణాలో ఆ పార్టీకే మద్దతివ్వమని సంకేతాలిచ్చిన పవన్?

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న మాటను బాగా వంటపట్టిచ్చుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణాలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని గతంలో ప్రకటించిన జనసేనాని ఇప్పుడు మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈసారికి తెలంగాణాలో పోటీకి నయ్ అంటున్నారట గబ్బర్ సింగ్. తెలంగాణా జనసైనికులు ఆత్మప్రబోధానుసారం ఓటెయ్యాలనే సంకేతం ఇవ్వనున్నారని సమాచారం‌.
 
తెలంగాణాలో ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటోంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల వ్యూహంలో బిజీబిజీగా ఉన్నాయి. గెలుపు కోసం టిఆర్ఎస్, టిఆర్ఎస్ కోట గోడలను బద్దలు కొట్టాలని కాంగ్రెస్, మరోవైపు మహాకూటమిలు పోరాడుతున్నాయి. అయితే జనసేన మాత్రం ఎన్నికలపై సైలెంట్‌గా ఉంది. మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోను పోటీ చేస్తుందని చెబుతూ వచ్చిన పవన్ మాత్రం ఇప్పుడు పంథా మార్చుకున్నారట. 119 అసెంబ్లీ స్థానాల్లోను పోటీ చేస్తానని ప్రకటించిన జనసేనాని ఆ తరువాత మెల్లగా వెనుకడుగు వేశారు. 
 
అన్నిచోట్లా పోటీ చేస్తామని ముందు చెప్పినా, అంత కాకున్నా 25 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపి స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుందని పవన్ భావించారు. కానీ ముందస్తు  ఎన్నికలు రావడంతో తన నిర్ణయాన్ని పూర్తిగా మార్చుకున్నారు. హడావిడిగా తెలంగాణాలో పోటీ చేసి చేతులు కాల్చుకోవడం కన్నా పోటీ నుంచి తప్పుకుంటే మంచిదన్న ఆలోచనలో పవన్ వచ్చినట్లు తెలుస్తోంది. 
 
తన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబే కాబట్టి ఎపి పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ తెలంగాణా ఎన్నికల్లో పరోక్షంగా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాలనుకున్నారట. జనసేన క్యాడర్‌ను తెలంగాణా గెలుపుకు ఉపయోగించాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీన తెలంగాణా నేతలతో కూడా పవన్ సమావేశం కానున్నారట. పవన్ లాంటి వ్యక్తి తమ పార్టీకి సపోర్ట్ చేస్తుండటంతో టిఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.