గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 డిశెంబరు 2020 (21:19 IST)

సింహపురి బిడ్డను.. అధికారం శివుడి మెడలో పాములాంటిది : పవన్ కళ్యాణ్

ఇటీవల వచ్చిన నివర్ తుఫాను దెబ్బకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా, కోస్తా జిల్లాల్లో అపారనష్టం వాటిల్లింది. ఈ తుఫాను బాధిత జిల్లాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ, నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. 
 
తన పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ శుక్రవారం నెల్లూరు జిల్లా నాయుడుపేటకు వచ్చారు. ఈ సందర్భంగా అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 
 
అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి జనసేన అంటే ఎందుకంత భయం అని ప్రశ్నించారు. అధికారం ఉంది కదా అని పోలీసుల సాయంతో అడ్డుగోడలు కడదామని ప్రయత్నిస్తే గోడలు బద్దలు కొట్టుకుని ముందుకు వెళతామని హెచ్చరించారు. 
 
తాను కూడా ఓ కానిస్టేబుల్ కొడుకునేనని, అందుకే ఖాకీలంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. అయితే, పోలీసులు అధికార పక్షం ఒత్తిళ్లతో అక్రమ కేసులు బనాయిస్తే వారిని గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. 
 
తాను వచ్చింది ఎవరితోనూ గొడవ పెట్టుకునేందుకు కాదని, రైతుల్ని పరామర్శించడానికని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాను సింహపురిలో పెరిగినవాడ్నని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. 
 
తాము ఎవరి జోలికి వెళ్లబోమని, తమను రెచ్చగొడితే రోడ్లమీదకు రావడానికైనా వెనుకాడేది లేదని వ్యాఖ్యానించారు. తాను చూడ్డానికి మాత్రమే యాక్టర్ నని, కానీ తన లోపల యాక్టర్ ఉండడని తీవ్రస్వరంతో హెచ్చరించారు.
 
ముఖ్యంగా, వైసీపీ నేతలు ఓ విషయం గుర్తుంచుకోవాలి. అధికారం శివుడి మెడలో పాము వంటిది. శివుడి మెడలో ఉన్నంతవరకే ఆ సర్పానికి విలువ. రోడ్డుమీదకు వస్తే దాని పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అధికారం లేని రోజున వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటో చూసుకోండి అని హితవు పలికారు.