శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 17 నవంబరు 2021 (19:42 IST)

తిరుపతిలో కేటుగాడు, పగలే దొంగతనాలు..

తిరుపతి నగరంలో పలు దొంగతనాలు చేసిన కరుడుకట్టిన దొంగను అరెస్ట్ చేసారు. సుమారు 20 లక్షల విలువైన 380 గ్రాముల బంగారు నగలు, 294 గ్రాముల వెండి ఆభరణాలు, 10,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. 

 
తిరుపతిలో నగరంలో గత మూడు నెలలుగా జరుగుతున్న పగటి, రాత్రి వేళల్లో దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారింది. ఎలాగైనా దొంగను పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి వెతకటం ప్రారంభించారు. తిరుపతి పట్టణం ఆటో నగర్, బస్ స్టాప్ వద్ద వరదరాజులు అనుమానంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితుడు పాత నేరస్థుడిగా నిర్థారించుకున్నారు.

 
నిందితుడు 12 ఇళ్ళల్లో పగటిపూటే దొందతనాలు చేసినట్లు విచారణలో అంగీకరించారు. నిందితుడి నుంచి 340 గ్రాముల బంగారు నగలు, 350 గ్రాములు వెండి ఆభరణములు మరియు 10,000 రూపాయలు నగదు స్వాధీనము చేసుకున్నారు.

 
నిందితుడు ముందుగా తాళం వేసిన ఇండ్ల కోసం రెక్కి చేసి తరువాత తనకు అనుకూలమైన సమయంలో అతనొక్కడే వెళ్లి, చేతికి గ్లౌజులు ధరించి, తనకున్న పరిజ్ఞానంతో ఇంటి తాళాలను పగలకొడతాడు. ఆ ఇంటి లోపలకి ప్రవేశించి దొంగతనము చేసుకొని, తన ఇంటిలోని వాళ్ళకు తెలియకుండా దొంగలించిన సొత్తును దాచిపెడతాడు. తన జల్సాల కోసం దొంగలించిన సొత్తులో కొద్ది కొద్దిగా తీసుకొని, గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మి, ఆ వచ్చిన డబ్బులతో తన జల్సాలకు ఖర్చుపెట్టేవాడని పోలీసులు గుర్తించారు.

 
దొంగలించిన మొత్తం నగలను చెన్నైలో అమ్మాలనే ఉద్దేశంతో ఆ నగలన్నింటిని ఎవరికీ అనుమానం రాకుండా ఒక లగేజ్ బ్యాగులో పెట్టుకొని, చెన్నైకి వెళ్ళే బస్సు కోసం తిరుపతి, ఆటో నగర్ బస్ స్టాండ్ వద్ద వేచి ఉండగా పోలీసులు పట్టుకున్నారు. పగటిపూట ఇంటికి తాళాలు వేసి వెళ్ళాలనుకునే వారు పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలంటున్నారు.