1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (20:52 IST)

విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో రాజకీయ నేతల సేవ‌లు భేష్: విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్

ఎన్న‌డూ చూడ‌ని కరోనా మహమ్మారి వంటి విప‌త్క‌ర ప‌రిస్థితి నేప‌ధ్యంలో గత 27 రోజులుగా పోలీసు శాఖ‌ మరియు పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివని వారిని గుర్తించాలనే సదుద్దేశంతోనే భాజ‌పా త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది.

ఈ సంద‌ర్భంగా భాజ‌పా ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు ఫ్రూట్ జ్యూసులు, గ్లూకోజ్ బాటిల్స్ అందించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావుకు వాటిని అందజేశారు.

ఈ సంద‌ర్భంగా సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు మాట్లాడుతూ.. నిత్యం పోలీసులపై విమర్శలు చేసే రాజకీయ పార్టీల నేతలు లాక్‌డౌన్ సమయంలో పోలీస్ సేవలను గుర్తించి జ్యూస్‌, గ్లూకోజ్ బాటిల్స్ అందించడం సంతోషంగా ఉందన్నారు.

24 గంటలు రోడ్లపై  విధులు నిర్వహిస్తూ  ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న పోలీస్, మున్సిపల్ సిబ్బంది వైద్యుల సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడపా నాగేంద్రం అన్నారు.

విజయవాడ నగరంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు సిబ్బందికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్లోబల్ ఇండియా సహకారంతో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 
ఈ క్ర‌మంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి గ్లోబల్ ఇండియా (న్యూ ఢిల్లీ) వారి యాజమాన్యంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ భాజపా సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఎన్.మధుకర్ జీ ద్వారా  రాష్ట్రంలో ఆయా శాఖలకు చేర్చాల‌న్న ఆదేశాలతో మంగ‌ళ‌వారం ఉద‌యం పోలీసు సిబ్బంది, మున్సిపల్ సిబ్బందికి రియల్ ఫ్రూట్ జుస్, గ్లూకోస్, ఎలెట్రోల్ పౌడర్, హాజ్మొల బిళ్ల‌లు, 1000 లీటర్ల చొప్పున 50 బాక్సులు పంపిణీ చేశారు.

పోలీసు సిబ్బంది తర‌పున సీపీ ద్వారకా తిరుమలరావుకు అందించగా పారిశుద్ధ్య కార్మికుల తర‌పున మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ కు 1000 లీటర్ల 50 బాక్సులు అందించారు.

ఈ సందర్భంగా భాజపా నాయకులు మాట్లాడుతూ.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శాంతి భద్రతలను కాపాడటంలో పారిశుద్ధ్యాన్ని నిరంత‌రం శుభ్రపరచడంలో ఎంత‌గానో పాటుపడుతున్న పోలీసు వారికి అలాగే పారిశుధ్య కార్మికులకి కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా వైరస్ మహమ్మారిని  త‌రిమి కొట్టాలంటే ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ తప్పక పాటించాలని సూచించారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని కోరారు.ప్రజలు ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని అన్నారు.

కార్యక్రమంలొ భాజ‌పా విజయవాడ నగర మాజీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి అడపా నాగేంద్రం, బిజెపి రాష్ట్ర మీడియా సెల్ కన్వినర్ వల్లూరి గంగాధర్, మాజీ కార్పొరేటర్ ఉత్తమ్‌చంద్ బండారి, రాజేష్ మైనేని తదితరులు పాల్గొన్నారు.