సానియా మీర్జాపై బీజేపీ ఫైర్: సిల్లీ, నాన్సెస్ అన్న మహిళా నేతలు!
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ అంబాసిడర్గా నియమించడాన్ని తప్పు బట్టడంపై తెలంగాణ రాష్ట్ర మహిళా నేతలు మండిపడ్డారు. సానియా మీర్జా తెలంగాణ అంబాసిడర్గా నియమించడాన్ని తప్పు పడుతూ బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని కాంగ్రెసు నేత, పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు.
సానియా యూత్ ఐకాన్ అని, దేశానికి కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టిందని రేణుకా చౌదరి తెలిపారు. ఒకవైపు బేటీ బచావో, బేటీ బధావో అని పార్లమెంటులో అంటారని, మరోవైపు మాటలను నిలబెట్టుకోరని ఆమె అన్నారు. ఓ పురుషుడు అంబాసిడర్ అయితే వారికి మంచిదని, ఓ మహిళ అయితే అటువంటి ప్రశ్నలు వేస్తారన్నారు. లక్ష్మణ్ వ్యాఖ్యలను ఆమె నాన్సెన్స్ అన్నారు.
మరోవైపు సానియాపై బిజెపి వ్యాఖ్యలు దురదృష్టకరమూ, అవాంఛనీయమని కాంగ్రెసు నాయకుడు మనీష్ తివారీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం పట్ల బిఎస్పీ చీఫ్ మాయావతి హర్షం వ్యక్తం చేశారు.
లక్ష్మణ్ వ్యాఖ్యలు చేసి వివాదం సృష్టించడం సిల్లీ అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బిజెపి నాయకులు అటువంటి ప్రటనలు చేసే ముందు సానియా మీర్జా రికార్డు చూడాలని, సానియా ఎన్నో అవార్డులు గెలుచుకున్నారని కవిత అన్నారు.
సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంలో తప్పేమిటని ఆమె అడిగారు. అమితాబ్ బచ్చన్ గుజరాత్కు చెందినవారు కారని, అయినా ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని, సానియా మీర్జా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడంలో తప్పేమిటని కవిత ప్రశ్నించారు.