శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (11:56 IST)

కోడికి కరోనా దెబ్బ... చికెన్‌ తింటే వైరస్‌ వ్యాపిస్తుందనే ప్రచారం

చుక్క వేసుకుంటే చికెన్ ముక్క తగలాల్సిందే. అలాంటి చికెన్ కోళ్ళకు కరోనా వైరస్ దెబ్బ తగిలింది. చికెన్ ఆరగిస్తే కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయం ప్రజలకు పట్టుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా చికెన్ ధరలు పడిపోతున్నాయి. గతంలో 200 రూపాయలు ఉన్న కేజీ చికెన్ ధర ఇపుడు రూ.150 కిందకు పడిపోయింది. ముఖ్యంగా, కరోనా వైరస్‌ దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ విక్రయాలు దారుణంగా పడిపోయాయి. 
 
ఈ వారం రోజుల వ్యవధిలో చికెన్‌ అమ్మకాలు 50 శాతం పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 70 శాతం వరకూ తగ్గిపోయాయని వాపోతున్నారు. చికెన్‌ ద్వారా కరోనా వైరస్‌ సోకుతుందనే అసత్య ప్రచారమే ఈ పతనానికి ప్రధాన కారణం. 
 
సాధారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోజుకు సగటున ఐదు లక్షల కేజీల చికెన్‌ విక్రయాలు జరుగుతుంటాయి. ఆదివారం, సెలవు దినాల్లో ఏడు లక్షల కేజీలు, పండుగ రోజుల్లో సగటున 15 లక్షల కేజీలు అమ్ముడవుతాయి. 
 
దేశవ్యాప్తంగా చికెన్‌, ఇతర మాంసాహారం ఎక్కువగా తీసుకునే రాష్ట్రాల్లో తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ తొలి మూడు స్థానాల్లో ఉంటాయి. ఈ సీజన్‌లో కోడి మాంసానికి గిరాకీ ఎక్కువ. అలాంటిది కరోనా వైరస్‌ దెబ్బకు అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. 
 
గత వారం రిటైల్‌ మార్కెట్‌లో స్కిన్‌లెస్ కేజీ రూ.180 వరకు పలికిన చికెన్‌ మంగళవారం నాటికి రూ.140కి పడిపోయింది. కిలో చికెన్‌ రూ.200 నుంచి రూ.150 దిగువకు పడిపోతే.. రూ.600లు ఉన్న మటన్‌ రూ.680-740 వరకు పలుకుతోంది.-