శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (11:24 IST)

'సార్స్' మరణ మృదంగాన్ని దాటేసిన కరోనా

పుష్కరకాలం క్రితం ప్రపంచాన్ని సార్స్ వైరస్ షేక్‌కు గురిచేసింది. ఈ సార్స్ వైరస్ దెబ్బకు దాదాపు 700 మంది వరకు చనిపోయారు. ఒక వైరస్ సోకి చనిపోవడం ఇదే హైలెట్‌గా నిలిచింది. కానీ, ఇపుడు ఈ సంఖ్యను కరోనా వైరస్ మృతుల సంఖ్య అధికమించింది. 
 
గత 2002-03 సంవత్సరంలో సార్స్ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. దీనిదెబ్బకు వందలాది మంది మృత్యువాతపడ్డారు. దాదాపు 18 సంవత్సరాల క్రితం వచ్చిన సార్స్ 774 మందిని బలితీసుకోగా (అధికారిక లెక్కలు), ఇప్పుడు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 900 దాటింది. కరోనా మృతులు వేల సంఖ్యలోనే ఉన్నారన్న అనుమానాలు ఉన్నా, చైనా ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు మాత్రం ఇవే.
 
ఇపుడు కరోనా ఎలాగైతే చైనాలో వెలుగులోకి వచ్చిందో, నాడు సార్స్ కూడా చైనాలోనే తొలిసారి బయటకు వచ్చింది. ఈ రెండు వైరస్‌లూ ఒకే క్రిమి కుటుంబానికి చెందినవి కావడం గమనార్హం. ఈ రెండింటినీ జీవాయుధాలుగా చైనాయే స్వయంగా అభివృద్ధి చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
 
ఇక, ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం, చైనాలో 40 వేల మంది వరకూ కరోనా సోకి బాధపడుతున్నారు. అందులో 6,188 మంది పరిస్థితి విషమంగా ఉంది. కొత్తగా 3 వేల మంది వరకూ అనుమానితులు ఆసుపత్రుల్లో చేరారు.