1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (12:11 IST)

పులిచింతల ప్రాజెక్టు స్టాప్ లాక్స్ ఏర్పాటులో జాప్యం

పులిచింతల ప్రాజెక్టుకు విరిగిపోయిన గేట్‌ను తిరిగి అమర్చే క్రమంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇందుకోసం పులిచింతల ప్రాజెక్ట్‌లో కనిష్ట స్థాయికి నీటిమట్టం చేరింది. ఎగువ నుంచి పూర్తిగా వరద ఉధృతి పూర్తిగా తగ్గిపోయింది. 
 
ప్రాజెక్టులో కొట్టుకుపోయిన 16వ గేట్ స్థానంలో స్టాప్‌లాక్ అమరుస్తున్నారు. సాయంత్రం వరకు స్టాప్‌లాక్స్‌ను ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. పులిచింతల 16, 17 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. 
 
11 స్టాప్‌ లాక్‌ గేట్‌ ఫ్రేమ్‌లకుగానూ నిపుణులు 3 ఫ్రేమ్‌లను అమర్చారు. పులిచింతల ఇన్‌ఫ్లో 15,517 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 70,740 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల పూర్తి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 125.65 అడుగులకు చేరుకుంది.
 
పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం యాజమాన్య నిర్వహణ లోపమేనని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. నిర్మాణపరంగానూ లోపాలున్నాయని మరికొందరు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం సహేతుక కారణాలను చెప్పలేకపోతోంది.
 
సాంకేతికపరంగా అధ్యయనం చేసి వారంలోగా పూర్తి నివేదిక ఇస్తామంటూనే.. దీనిని రాజకీయపరమైన అంశంగా మార్చేసింది.. ప్రతిపక్షంపై అభాండాలు వేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టును టీడీపీకి చెందిన కాంట్రాక్టరు నిర్మించారని జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌ శుక్రవారం సచివాలయంలో చెప్పారు. 
 
ప్రాజెక్టుపై 2015లో వచ్చిన నివేదికపై నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టు సంస్థ బిల్లుల చెల్లింపుల కోసం న్యాయస్థానానికి వెళ్తే.. ఎందుకు కౌంటర్‌ వేయలేదని అడిగారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఇవే ప్రశ్నలను ప్రభుత్వానికి సంధిస్తున్నాయి. 
 
2015లో ఇంజనీరింగ్‌ అధికారుల బృందం సమర్పించిన సదరు నివేదిక ఆధారంగా బాధ్యులపై ఇప్పుడు చర్యలు చేపడుతుందా అని నిలదీస్తున్నాయి. ఏం జరిగినా రాజకీయ ఆరోపణలతో సరిపుచ్చడం జగన్‌ సర్కారుకు అలవాటుగా మారిందని ఆక్షేపిస్తున్నాయి.