1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 మే 2021 (22:03 IST)

కేంద్రం అనుమతిస్తే విదేశాల నుంచి టీకాల కొనుగోలు: అనిల్‌కుమార్ సింఘాల్

అమరావతి: కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే విదేశాల నుంచి కూడా టీకాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడ‌చిన 24 గంటల్లో 60,124 కరోనా టెస్టులు చేయగా, 14,986 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 84 మంది మృతి చెందారన్నారు.

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితి, నివారణకు తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరుతెన్నులపై కమాండ్ కంట్రోల్ సెంట్రల్ అధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 648 ఆసుత్రుల్లో ఆర్యో శ్రీ పథకం కింద క్యాష్ లెస్ ట్రీట్ మెంటు చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ కింద రోగుల అందించే సేవలకు ఆయా ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,803 ఐసీయూ బెడ్లలో 6,247 రోగులతో నిండిపోయాయన్నారు. కర్నూల్ 263 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు 23,372 ఉండగా, 22,298 బెడ్లు రోగులతో నిండి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న 102 కొవిడ్ కేర్ సెంటర్లలో 49,240 బెడ్లు ఏర్పాటు చేయగా, 15,056 మంది వైద్య సేవలు పొందుతున్నారని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24,273 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

గడిచిన 24 గంటల్లో ప్ర్రైవేటు ఆసుత్రులకు 10,738 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందజేశామన్నారు. 104 కాల్ సెంటర్ కు 16,663 ఫోన్ కాల్స్ గడిచిన 24 గంటల్లో రాగా, వాటిలో వివిధ  సమాచారాల కోసం 7,052 కాల్స్ ఉన్నాయన్నారు. కరోనా టెస్టుల కోసం 3,488, అడ్మిషన్లకు 3,383 కాల్స్, కరోనా టెస్టు ఫలితాల కోసం 2,074 కాల్స్ వచ్చాయన్నారు. టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా 3,496 వైద్యులు... హోం ఐసలేషన్లో ఉన్న 6,508 మంది పేషంట్లకు ఫోన్ ద్వారా సలహాలు సూచనలు, అవసరమైన బెడ్ల కోసం వైద్యాధికారులకు సిఫార్సులు చేశారన్నారు.

ఇప్పటి వరకూ కొవిడ్ నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించామన్నారు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ఆధారంగా వైద్య విద్యార్థుల సేవలను కొవిడ్ నియంత్రణలో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 3,720 ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులు, 1,302 మంది పీజీ విద్యార్థులు, 3,786 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు, 4,039 హౌస్ సర్జన్లు, 137 ఎంస్సీ నర్సింగ్ విద్యార్థులను గుర్తించామన్నారు. ఆ జాబితాను జిల్లా కలెక్లర్లకు పంపించామని, విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలని ఆదేశించామన్నారు.
 
ఆరోగ్య శ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రలన్నింటినీ కవర్ చేయాలని నిర్ణయించామన్నారు. సోమవారం మధ్యాహ్నానికి ప్రైవేటు ఆసుపత్రుల్లో 47,644 బెడ్లు ఉండగా, వాటిలో ఆరోగ్య శ్రీ కింద 24,645 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఆరోగ్య శ్రీ కింద చేర్సిన ప్రైవేటు ఆసుపత్రులలో ఆరోగ్య మిత్రలను, నోడల్ ఆఫీసర్లను నియమించాలని, హెల్ప్ డెస్కలు ఏర్పాటుచేయలని సీఎం ఆదేశించారన్నారు. రాష్ట్రంలో చేపట్టిన వ్యాక్సినేషన్ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చామని, 45 ఏళ్లు పైబడిన వారికే టీకా వేయాలని నిర్ణయించామన్నారు.

కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం వినతిని మన్నిస్తూ అంగీకారం తెలిపిందన్నారు.ఇదే విషయం జిల్లా కలెక్టర్లకు ఆదేశించామన్నారు. వ్యాక్సినేషన్ సందర్భంగా ఆయా టీకా కేంద్రాల్లో  షామియానాలు, కుర్చీలు, తాగునీరు కల్పించాలని, ఎస్ఎంఎస్ లు, వలంటీర్ల ద్వారా సెకండ్ డోస్ తీసుకునేవారికి సమాచారం ఇవ్వాలని ఆదేశించామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

రాష్ట్ర జనాభాకు అవసరమైన 4 కోట్ల వ్యాక్సిన్లను కొనుగోలుకు అవసరమైన రూ.1600 కోట్లను ఇప్పుడే చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాని, కేంద్ర నిబంధనలు ఆటంకంగా మారాయన్నారు. వివిధ కంపెనీలు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మిగిలిన 50 శాతం వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వ సూచించిన కోటా ప్రకారమే ఆయా రాష్ట్రాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.

ఇష్టమొచ్చినట్లు కొనుగోలు చేయడానికి కుదరదన్నారు. ఇదే విషయం సుప్రీం కోర్టులో వేసిన అఫిడివిట్ లో కేంద్రం చెప్పిందన్నారు. మే నెల వరకూ 17 లక్షల కొవిషీల్డ్, కొవాగ్జిన వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఇందుకు అవసరమైన నిధులు కూడా చెల్లించామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, అందరికీ ఫ్రీ వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించిందని వెల్లడించారు. 
 
కేంద్ర అనుమతిస్తే... విదేశీ టీకాలను కొనుగోలు చేస్తాం...
స్పుత్నిక్ వి సహా విదేశాల నుంచి వచ్చే ఏ కొవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని, ఇందుకోసం గ్లోబల్ టెండర్లు కూడా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. విదేశాల నుంచి టీకాలు కొనుగోలు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి అని ఆయన తెలిపారు. విదేశీ టీకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే  కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచడం ద్వారా సకాలంలో దేశ ప్రజలందరికీ టీకాలు వేయగలమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన అన్ని అనుమతులను తక్షణమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ల ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు...
స్టాక్ ఉన్నంత వరకూ 45 ఏళ్లకు పైబడిని వారికి సెకండ్ డోస్ ఇవ్వాలని, వారికివ్వగా మిగిలితే...ఫస్ట్ డోస్ కింద టీకా వేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. బెడ్ల సమస్య ఉన్న చోట్ల ఆసుపత్రుల ఆవరణలోగాని, సమీపంలో ఉన్న పర్మినెంట్ భవనాలు లభిస్తే వాటిలో బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారన్నారు. పేషంట్లు ఆరు బయట ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. మంగళరవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా  కలెక్టర్లతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

బుధవారం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుందన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారన్నారు. ఆ కమిల్లో ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఇతర అధికారులు  ఉంటారన్నారు. ఆ కమిటీ సమావేశాలు వారానికి రెండు పర్యాయాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 73,49,960 డోసులు అందజేసిందని, వాటిలో 73,00,463 వ్యాక్సిన్ వేశామని ఆయన తెలిపారు. మే మొదటి వారంలో 9,17,850 డోసుల కేటాయించగా, ఇప్పటికే 7,65,365 టీకాలు వచ్చాయని, వాటిని ఇప్పటికే వాడుకున్నామని తెలిపారు.

ఇంకా 1, 52,490 డోసులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన 16,85630 డోస్ ల్లో 4,93,930 వచ్చాయన్నారు. వాటిని కూడా 45 ఏళ్లకు పైబడిన వారికి వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, అందుకు కేంద్ర ప్రభుత్వం అంగకీరించడం తెలిసిన విషయమేనన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొవిన్ యాప్ ను మార్పుచేయాల్సి ఉందన్నారు. మే మూడో వారంలో కొవిషీల్డ్ డోసులను అందజేస్తామని సీరం యాజమాన్యం ఈ మెయిల్ ద్వారా తెలిపిందన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికి 6,90,677 మందికి సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉందన్నారు. 10.96,614 మందికి మే 15 తరవాత సెకండ్ డోస్ వేయాల్సి ఉందన్నారు. మే 31 నాటికి 17 లక్షల మందికి పైగా సెకండ్ డోస్ ఇవ్వాలసి ఉందన్నారు. కేంద్ర ఇచ్చే కోటా కూడా సరిపోదన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలుచేసే స్టాక్ ను కూడా 45 ఏళ్లకు పైబడే వారికి ఇవ్వనున్నామన్నారు. సెకండ్ డోస్ ఇవ్వగా, పబ్లిక్ తో దగ్గరగా విధులు నిర్వహించే ఆర్టీసీ, బ్యాంకు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉందన్నారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య అంబులెన్స్‌లను ఎటువంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించేలా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మాట్లాడుకున్నారని తెలిపారు. ఇప్పటికే సమస్య పరిష్కారమై ఉండొచ్చ‌న్నారు.