హుదూద్ మృతుల కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష సాయం!
హుదూద్ తుఫాను కారణంగా మృత్యువాత పడిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు.
తుఫాను బాధిత ప్రాంతాల్లో ఆయన ఆదివారం పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం గ్రామంలో తుఫాను బాధితులను పరామర్శించారు. తుఫాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష చొప్పున చెక్కులు అందించారు.
ఏ కష్టమొచ్చినా తొలుత పేదవాడే నష్టపోతున్నాడని ఈ సందర్భంగా రాహుల్ వ్యాఖ్యానించారు. బాధితులకు అండగా ఉంటామని, వారికి పూర్తిస్థాయిలో సాయం అందేంతవరకు కేంద్రంతో పోరాడతామని హామీ ఇచ్చారు.