13న అల్పపీడనం... నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఈ నెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ కారణంగా ఈ నెలాఖరు వరకు ఏపీ, తెలంగాణాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ - వాయువ్య దిశగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల వైపు కదిలే సూచనలు ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావం కారణంగా ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరోవైపు, రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. నిన్న అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ ఏపీలోని పలు ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత తీవ్రంగా ఉంది. కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, గన్నవరం, బాపట్ల, కావలి, నెల్లూరు వంటి తీర ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.