1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 25 జులై 2014 (16:31 IST)

పవన్ కళ్యాణ్‌కు రాజు రవితేజ దూరమయ్యారా... ఆనందసాయి ఎవరు?

జనసేన అధినేత సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రాజు రవితేజ దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది. రాజు రవితేజ జనసేన కార్యకలాపాల్లోనూ తన సామాజిక సేవా కార్యక్రమాల్లో తన మెంటర్ అని పవన్ కళ్యాణ్ చెప్పుకున్న సంగతి స్పష్టమే. ఐతే జనసేన పార్టీ పనులను పవన్ కళ్యాణ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయికి అప్పగించినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. రాజు రవితేజ నిజంగానే పవన్ కళ్యాణ్ కు దూరమయ్యారా లేదంటే ఇదో ప్రచారమా అనేది తెలియాల్సి ఉంది.
 
కాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీని నిర్మాణాత్మకంగా పటిష్టపరిచే చర్యలు చేపట్టారు. 2014 ఎన్నికల సమయంలో పార్టీని స్థాపించి అటు మోడీకి, ఇటు చంద్రబాబులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారే గానీ, పోటీకి మాత్రం దూరంగా వున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన రెండు పార్టీలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చాయి.
 
ఇక అప్పట్నుంచి మీడియాకు సైతం దూరంగా వుంటూనే వచ్చారు పవన్. అయితే రైల్వే ఛార్జీలు పెంచినపుడు కనీసం పవన్ నుంచి ఖండన ప్రకటన కూడా రాకపోవడం కొంత విమర్శలకు దారి తీసింది. ఇప్పుడా విమర్శలను తిప్పికొట్టేందుకే పవన్ జనసేన పార్టీని సీరియస్‌గా తీసుకుంటున్నారు. 
 
ఇకనుంచి పార్టీని క్రియాశీలక రాజకీయాల్లో వుంచాలని పవన్ భావిస్తున్నారు. ఎన్నికల ముందే కొన్ని సినిమాలను అంగీకరించడంతో వాటిని పూర్తిచేసే పనిలో వున్నారు. మరోపక్క త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ రిజిస్ట్రేషన్ పనులు పూర్తిచేసేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఇప్పటివరకూ జనసేన పోస్టర్లలో ప్రచురించిన పిడికిలి గుర్తునే పార్టీ సింబల్‌గా చేసుకోవాలనుకుంటున్నారు. ఈ పనికి చిత్ర పరిశ్రమకు చెందిన ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయికి బాధ్యతలు అప్పగించారు. జనసేన పార్టీ ఏర్పాటు వెనుక వెన్నెముకలా వున్న రాజు రవితేజ ఇప్పుడీ వ్యవహారాలకు దూరంగా వుండటం విశేషం.