గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 మే 2021 (14:11 IST)

రుయా ఆస్పత్రి ఘటన.. #ResignJagan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌

కోవిడ్ మహమ్మారి కారణంగా భారీ సంఖ్యలో మృతులు పెరిగిపోతున్నాయి. సరైన వైద్య సదుపాయాలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో కోవిడ్ వ్యాధిగ్రస్థులు చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. అటువంటి సమయంలో తిరుపతిలోని ఎస్‌వీఆర్ రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలచివేస్తోంది. 
 
దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ట్విట్టర్‌లో #ResignJagan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు 20.5 వేల ట్వీట్లు చేశారు.
 
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం రుయా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వారంలో ఇటువంటి సంఘటనలు మరికొన్ని చోట్ల కూడా జరిగాయి.
 
దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నాయకత్వ లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. 
 
కోవిడ్-19 రెండో ప్రభంజనం వచ్చినప్పటి నుంచి కనీసం ఒకసారైనా ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన బయటకు రావడం లేదని ఆరోపిస్తున్నారు.
 
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తిరుపతి రుయాలో మరణ మృదంగం మోగిందని ఓ ట్విటరాటీ ఆరోపించారు. తనకు కన్నీళ్ళు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా ఎలా వ్యవహరించగలుగుతోందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని సమర్థించేవారిపై పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ఆంధ్ర ప్రదేశ్ నిజంగా విపత్తులో ఉందని మరో ట్విటరాటీ అన్నారు.