స్వశక్తితో బతకాలని చెప్పిందనీ తల్లిని హత్య చేసిన కొడలు - కోడలు.. నిందితుల అరెస్టు
ఈనెల 23వ తేదీన జరిగిన మాకినేని సత్యశ్రీ హత్య కేసులో ఆమె కొడుకు సందీప్, కోడలు శ్రావణ్యను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే... గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని సీతారామ ఆపార్ట్మెంట్లో ఈనెల 23వ తేదీ సత్యశ్రీ చనిపోయి విగతజీవిగా పడివుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు.
దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యావంతుడైన సందీప్ బిటెక్ చదువుకుని, పలు వ్యాపారాలు చేసి, ఉన్న ఆస్తిని తగలబెట్టాడు. కొడుకు, కోడలు స్వశక్తితో బతకాలని తల్లి సత్యశ్రీ పలుమార్లు చెప్పినా పెడచెవిన పెట్టారు. దీంతో తల్లిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఎవరు లేని సమయం చూసి కొడుకు, కోడలు సత్యశ్రీని షూలేస్తో గొంతు బిగించి, వాటర్ క్యాన్తో తలపై బాది, దారుణంగా పీకపిసికి చంపినట్లు సిఐ వెల్లడించారు. పోలీసుల విచారణలో సత్యశ్రీని హత్య చేశామని కొడుకు, కోడలు నేరాన్ని అంగీకరించారు. దంపతులపై పోలీసులు కేసు నమోదు చేసి వినుకొండ కోర్టులో హాజరుపరిచారు. తర్వాత రిమాండ్కు పంపించారు.