శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (11:17 IST)

గురుకుల పాఠశాలలో గురువే కీచకుడు....

గురుకుల పాఠశాలలో ఓ గురువే కీచకుడిగా మారిపోయాడు. కన్నవారికి దూరంగా ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న బాలికలను లైంగికంగా వేధించాడు. ఈ వేధింపులు భరించలేని కొంతమంది బాలికలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారం పోలీసులకు చేరి బహిర్గతమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలో బాలికల గురుకుల పాఠశాల ఉంది. ఇక్కడ వైస్‌ ప్రిన్సిపల్‌ కృపారావు అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈయన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. 
 
దీనిపై సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త టి.రాధా సుధారాణి మంగళవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. తొలుత ప్రిన్సిపల్‌, అధ్యాపకులు, సిబ్బందిని విచారించిన ఆమె ఆ తర్వాత విద్యార్థినులతో మాట్లాడారు. వారు భోరున విలపిస్తూ వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రవర్తిస్తున్న తీరును వివరించారు. 
 
బాధిత విద్యార్థుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. వైస్‌ ప్రిన్సిపల్‌ మద్యం తాగి పాఠశాలకు వస్తూ, తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని కొందరు చెప్పారు. విద్యార్థినుల ఫిర్యాదుపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. 
 
పని చేయాలని ఒత్తిడి చేయడం వల్ల కొందరు ఉపాధ్యాయినులు తనపై ఆగ్రహంతో తప్పుడు ఫిర్యాదులు చేయించారని.. ఆరోపణలు ఎదుర్కొన్న కృపారావు విలేకరులకు చెప్పారు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనట్లు విద్యార్థినులు గతంలో ఎప్పుడూ తనతో చెప్పలేదని ప్రిన్సిపల్‌ వి.వి. ప్రశాంతికుమారి అన్నారు.