1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (11:41 IST)

5న శంకరగుప్తం గ్రామంలో మంగళంపల్లి విగ్రహావిష్కరణ

గజల్ చారిటబుల్ ట్రస్ట్, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో కీర్తిశేషులు డా.మంగళంపల్లి బాలమురళీ కృష్ణ విగ్రహాష్కరణ జరుగనుంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లాలోని డాక్టర్ మంగళంపల్లి జన్మస్థలమైన శంకరగుప్తం గ్రామంలో ఈ నెల 5వ తేదీన ఉదయం 9.42 నిమిషాలకు ఏపీ రాష్ట్ర శాసన ఉపసభాపతి కోనరఘుపతి ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, కార్యక్రమం సంచాలకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్‌లు సంయుక్తంగా విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. 
 
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా, విశిష్ట అతిథిలుగా ఎంపీ చింతా అనురాధ, జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పెదపాటి అమ్మాజీ, మురళీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమ సంచాలకులు డా.గజల్ శ్రీనివాస్, రాయప్రోలు భగవాన్, కమిటీ అధ్యక్షులు ఆచంట వీర వెంకట సత్యనారాయణలు, శ్రీధర్ అప్పసాని, నాట్స్ ఛైర్మన్, శ్రీనివాస్ మంచికలపూడి, ప్రెసిడెంట్ నాట్స్ తెలిపారు.
 
ఈ సందర్భంగా ప్రముఖ విద్వాంసులు, కళాకారులు డి.వి.మోహన్ కృష్ణ, మోదుమూడి సుధాకర్, వేమూరి విశ్వనాథ్, కృష్ణకుమార్, స్వాతీ సోమనాథ్, కళా పోషకులు ఉద్ధరాజు కాశీ విశ్వనాధరాజులకు "డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ కళా పురస్కారాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే డా.బాలమురళి శిష్యులతో సంగీత నీరాజన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు.