1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 12 జులై 2023 (14:32 IST)

సంపదను సృష్టించే అమరావతిని చంపేశారు : చంద్రబాబు

chandrababu
సంపదను సృష్టించే అమరావతిని చంపేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఒక వ్యక్తి మూర్ఖత్వం కోసం ఈ రాష్ట్ర ప్రజలు బలికావాలా అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, మహానాడు వేదికగా తాము ప్రకటించిన మినీ మేనిఫెస్టో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఇందులో పూర్ టు రిచ్ విధానం ఆసక్తిని రేకెత్తిస్తోందన్నారు. 
 
పూర్ టు రిచ్ విధానం వినూత్నమైనదని చెప్పారు. పూర్ టు రిచ్ విధానాన్ని అర్థం చేసుకోవడం కొంత కష్టమైనా... ఆచరణలో ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్నారు. పేదలకు ఇప్పుడు రోజుకు రూ.150 మాత్రమే వస్తోందని... సంపదను సృష్టించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో పేదరికం ఉందన్నది ఎంత వాస్తవమో... సంపదను సృష్టించడం కూడా అంతే అవసరమని అన్నారు.
 
మహిళలకు ఇప్పటివరకు నాలుగు పథకాలను మాత్రమే ప్రకటించామని... మరిన్ని ఎక్కువ కార్యక్రమాలను కూడా చేసే ఆలోచన ఉందని చంద్రబాబు చెప్పారు. ఎక్కువ కార్యక్రమాల్లో మహిళలను భాగస్వాములను చేస్తే... కుటుంబం, సమాజం రెండూ బాగుపడతాయన్నారు. కట్టెల పొయ్యి మీద తన తల్లి పడిన కష్టాలను తాను చూశానని... అందుకే ఏ మహిళ కష్టపడకూడదని ఆనాడు గ్యాస్ సిలిండర్లను తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. 
 
ఇపుడు పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరతో మహిళలు మళ్లీ కట్టెల పొయ్యికి పరిమితమయ్యే పరిస్థితులు ఉన్నాయని... అందుకే ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా టీడీపీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. మహిళా శక్తి ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతూనే వస్తోందని... అగ్రరాజ్యం అమెరికాకు కూడా ఇప్పటివరకు మహిళ అధ్యక్షురాలిగా కాలేదని చెప్పారు. మినీ మేనిఫెస్టోలో మహాశక్తి పేరిట మహిళలకు ప్రాధాన్యతను కల్పించామని చంద్రబాబు అన్నారు.