శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (13:51 IST)

వరద బాధితులను ఆదుకోవాలంటూ సమీర్ శర్మకు బాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకోవాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఓ లేఖ రాశారు. అలాగే, వరదల్లో ప్రభుత్వం వైఫల్యంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
 
ఈ మేరకు సీఎస్‌కు చంద్రబాబు రాసిన లేఖలో ప్రభుత్వం అంచనాల మేరకు వరద నష్టం రూ.6,054 కోట్లు వాటిల్లితే కేవలం రూ.35 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకోవడం సరైన విధానం కాదన్నారు. 
 
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ఖర్చు చేయాల్సిన రూ.1100 కోట్లను ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లించడంపై కాగ్ కూడా తీవ్రంగా తప్పుబట్టిందని గుర్తుచేశారు. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. 
 
ముఖ్యంగా, తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట చెరువును ఆట స్థలంగా మార్చడంతో తిరుపతి పట్టణం వరదలు ముంచెత్తాయని, వరదల్లో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. 
 
ముఖ్యంగా, కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరద కారణంగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లిందన్నారు. రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిందన్నారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని చంద్రబాబు నాయుడు రాసిన లేఖలో కోరారు.