1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 5 అక్టోబరు 2021 (12:16 IST)

నెగ్గిన వైసీపీ అవిశ్వాసం.... కాకినాడ మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ అవుట్!

కాకినాడ  మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పై అవిశ్వాసంలో  టి.డి.పి.కి  షాక్ త‌గిలింది. రెబల్  కార్పోరేటర్లు, టి.డి.పి  మేయర్ పై కౌన్సిల్ లో ప్రవేశపెట్టిన  అవిశ్వాసం గెలిచింది. మేయర్ పై అవిశ్వాసానికి  అనుకూలంగా 36 ఓట్లు,  అనుకూలంగా ఒక ఓటు  వచ్చాయి. అనుకున్నట్లుగానే  మేయర్  సుంకర పావని, మొదటి డిప్యూటీ మేయర్ సత్తిబాబులను పదవుల నుంచి 33 మంది  కార్పొరేటర్లు దించేశారు. దీనితో  వై.సి.పి  వ్యూహం ఫలించింది.
 
చివరి ఏడాది మేయర్ టి.డి.పి చేతిలో ఉండకూడదని వై.సి.పి. వేసిన‌ వ్యూహం  ఫలించింది.  మేయర్ పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 36 మంది చేతులెత్తారు.  మంత్రి  కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా ఓటింగ్ లో  పాల్గొన్నారు. అంతకు ముందు తిరుగుబాటు కార్పొరేటర్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో సహకార శాఖ మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత  తోడు రాగా, కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వరకు పాదయాత్రగా తరలివచ్చారు. భారీ భద్రత నడుమ అవిశ్వాస తీర్మానం జరిగింది. తెలుగుదేశం పార్టీకి తొమ్మిది మంది కార్పొరేటర్లు మిగిలి ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నా, వారు ఎవరూ ఓటింగ్ ప్రక్రియకు రాలేదు.