శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (22:11 IST)

కృష్ణా ఎల్లా, పునావాలాను ఎత్తుకొచ్చి స్టేషన్‌లో కూర్చోబెడితే వ్యాక్సిన్లు ఇవ్వరా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఏపీలో వ్యాక్సినేషన్ కొరత నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మంత్రులు ఆళ్లనాని, అనిల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. 
 
'భారత్ బయోటెక్‌తో ఆయనకు(చంద్రబాబు)న్న బంధుత్వాన్ని ఉపయోగించి, రాష్ట్రానికి వ్యాక్సిన్‌ను తెప్పించినా మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు' అని ఏపీ వైద్య మంత్రి ఆళ్ల నాన్ని అన్నారు. 
 
అలాగే, మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, 'రామోజీ వియ్యంకులు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. చంద్రబాబు ముందుకు రావాలి. ముందుకు వచ్చి వ్యాక్సిన్లు ఇప్పిస్తే కొనుగోలుకు సిద్ధమే' అని వ్యాఖ్యానించారు. 
 
దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కాస్తంత వ్యగ్యంతో కూడిన కౌంటర్లు ఇచ్చారు. ఏసీబీ, సీఐడీని పంపించి, సంగం డైరీని స్వాధీనం చేసుకొని అమూల్‌కు అప్పజెప్పినట్లే భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్‌లను స్వాధీనం చేసుకొని, మన వాళ్లకు ఇవ్వడం కుదరదా? అని సూటిగా ప్రశ్నించారు. 
 
ఏసీబీ, సీఐడీలు కృష్ణా ఎల్లా, పూనావాలాను ఎత్తుకు రాలేరా? అని ప్రశ్నించారు. ఉత్తరం రాసినా వ్యాక్సిన్లు ఇవ్వడం లేదని కర్నూలు, కడప స్టేషన్లలో కేసులు పెట్టించి పట్టుకు రావచ్చు కదా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఐడీ ఆఫీసులో రోజుకు తొమ్మిది గంటలు కూర్చోబెడితే మొత్తం కంపెనీ రాసిచ్చి వెళ్లరా? వాళ్లని అడుక్కోవడం ఏంటని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.