1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (08:33 IST)

వైసీపీ దాడులకు నిరసనగా ఏపీలో టీడీపీ రాష్ట్రబంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు తెగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల నివాసాలు, కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు విధ్వంసం సృష్టించారు. ఈ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ దాడులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 
 
ఈ దాడులకు నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు తాను సాధారణంగా బంద్‌లకు పిలుపు ఇవ్వనని, కానీ నేడు జరిగిన ఘటనలతో బంద్‌కు పిలుపునివ్వాల్సి వస్తోందని అన్నారు.
 
రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని తెలిపారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఏనాడూ రాష్ట్రంలో 356 ఆర్టికల్ అమలు చేయాలని తమ పార్టీ గతంలో ఎప్పుడూ కోరలేదని, కానీ ఇవాళ్టి ఘటనల నేపథ్యంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముందో చెప్పాలని అన్నారు. 
 
గతంలో ఎక్కడైనా 356 ఆర్టికల్ అమలు చేసి ఉంటే, ఇంతకంటే బలమైన కారణాలు అక్కడ ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యంపైన జరిగిన దాడి కాదా? ప్రతి ఒక్క పార్టీ కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా అని విజ్ఞప్తి చేశారు.
 
ఇదిలావుంటే, టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోని పలుచోట్ల టీడీపీ ముఖ్యనేతల ఇళ్లపై దుండగులు దాడులకు దిగడంతో అప్రమత్తమైన పోలీసులు చంద్రబాబు ఇంటి వద్ద భద్రతను పెంచారు. 
 
తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆదేశాలతో పోలీసులను మోహరించారు. మరోవైపు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం అనకాపల్లిలో పర్యటించాల్సి ఉండగా మంగళవారం ఘటనల నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు తెలిపారు. కాగా, దాడులకు నిరసనగా టీడీపీ నేడు రాష్ట్రంలో బంద్ పాటిస్తోంది.