1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (19:55 IST)

పర్యాటక హోటళ్లలో శతశాతం ఆక్యుపెన్సీపై దృష్టిపెట్టాలి: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

రాష్ట్రంలోని పర్యాటక హోటళ్లలో శత శాతం ఆక్యుపెన్సీ సాదించే అంశంపై అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయంలోని తమ ఛాంబరులో పర్యాటక, క్రీడా శాఖల అధికారులతో మంత్రి సమావేశమై శాఖల వారీగా నిర్వహిస్తున్న పనుల ప్రగతిని సమీక్షించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రానున్న నాలుగు మాసాలు  పర్యాటకానికి మంచి సీజన్ అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాంతాల వారీగా  కనీసం నాలుగు పర్యాటక ఫెస్టివల్స్ నిర్వహించాలన్నారు. అందుకు తగ్గట్టుగా స్పాన్సర్లను గుర్తించాలన్నారు. 

రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ప్రతిరోజూ కనీసం రెండు జిల్లాలలో పర్యటిస్తూ  పర్యాటక హోటల్స్, రిసార్ట్స్ లో సౌకర్యాల మెరుగుకై నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నెల రోజుల్లో పర్యాటక హోటల్స్, రిసార్ట్స్ లో పూర్తిగా మార్పులు తీసుకువచ్చే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు.  ప్రైవేట్ అపరేటర్లతో మాట్లాడి బోటింగ్  సౌకర్యం  పర్యాటకులకు అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలన్నారు.

టూరిజం ప్రమోషన్లలో భాగంగా రూపొందిస్తున్న యాప్ ను రెండు నెలల్లో అందుబాటులోకి తేవాలన్నారు.  కొత్త సంవత్సరంలో  పర్యాటకులకు ఈ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి  రావాలన్నారు. ప్రభుత్వ పాలసీకి తగ్గట్టుగా అధికారులు, ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలని  పర్యాటక రంగంలో  స్పష్టంగా మార్పులు, అభివృద్ది తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 
 
అనంతరం క్రీడా శాఖ కార్యక్రమాలను మంత్రి సమీక్షిస్తూ జిల్లా స్థాయి సీఎం కప్ టోర్నమెంట్స్ ను నిర్వహించాలని,  వచ్చే నెల 6 న విజయనగరంలో ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. అనంతరం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలలో కూడా సీఎం కప్ టోర్నమెంట్స్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తెనాలి, బాపట్లలో ఉన్న రెండు క్రీడా వికాస కేంద్రాలను నవంబర్ 1 న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.