1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (19:51 IST)

విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన.. స్టీల్ ప్లాంట్ నిలుపుదల కోసం..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు 31వ తేదీన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి స్టీల్‌ ప్లాంట్‌ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. 31వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు సభ ప్రారంభమవుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ ఉక్కు పరిరక్షణ సమితి పోరాడుతోంది. 
 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ అంశంపై తొలుతనే స్పందించి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన నాయకుడు పవన్‌ కళ్యాణ్ గారే. ఫిబ్రవరి 9న పవన్‌ కళ్యాణ్ కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షాని కలిసి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయాన్ని కేంద్రానికి తెలియచేస్తూ, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని వినతి పత్రం అందించిన విషయం విదితమే. 
 
34 మంది ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటైందనే విషయాన్ని ఈ సందర్భంగా అమిత్‌ షాకి తెలియజేశారు. జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్ గారు తమ పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో పవన్ ఈ నెల చివర్లో విశాఖలో పర్యటించనున్నారు.