శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (07:01 IST)

బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: చంద్రబాబు

బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం స్థానిక సంస్థల్లో 59 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రిజర్వేషన్ల విషయంలో సమర్థుడైన న్యాయవాదిని పెట్టకుండా కేసును నీరుగార్చిందని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 59 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం స్పష్టమైందని చంద్రబాబు విమర్శించారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సమావేశమైన ఆయన... కోర్టు తీర్పుపై చర్చించారు. రైతులకు అన్యాయం చేసేందుకు న్యాయవాదికి రూ.5 కోట్లు ఖర్చు పెట్టడానికి సైతం వెనుకాడని ప్రభుత్వం... రిజర్వేషన్ల విషయంలో మాత్రం సమర్థుడైన న్యాయవాదిని పెట్టకుండా కేసును నీరుగార్చిందని ఆరోపించారు.

బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని, అప్పుడు టీడీపీ సైతం కేసులో ఇంప్లీడ్‌ అవుతుందన్నారు.
 
బలహీన వర్గాల రిజర్వేషన్లు తగ్గిస్తే సహించేది లేదు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాల రిజర్వేషన్లు తగ్గిస్తే సహించేది లేదని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు అన్నారు. అవసరమైతే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. తొమ్మిది నెలల పాలనలో బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

బీసీ పథకాల్లో కోత విధిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీల రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా టీడీపీ కేసు వేసిందంటూ మంత్రి బొత్స తప్పుడు ప్రచారం చేసున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకు అండగా ఉన్నది బీసీలేనన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు.

న్యాయస్థానం చెప్పిందని బీసీల రిజర్వేషన్ తగ్గిస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు. తప్పు చేయాల్సిన అవసరం లేదు.. ఇఎస్​ఐలో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. ఎలాంటి తప్పు చేయకున్నా కోట్ల రూపాయల కుంభకోణం చేసినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు.