శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (08:38 IST)

సమగ్రాభివృద్ధి కోసమే మూడు రాజధానులు.. మోడీకి జగన్ వివరణ

ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంట 40 నిమిషాల పాటు ఇరువురి మధ్య సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ నివేదించారు. సమగ్రాభివృద్ధి కోసమే మూడు రాజధానులు పెడుతున్నట్లు జగన్ వివరించారు.

ఈ మేరకు మోదీకి జగన్ లేఖ అందించారు. అనంతరం లేఖలోని అంశాలను ప్రధానికి సీఎం వివరించారు. ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధానిని సీఎం జగన్ కోరారు.  
 
వినతి పత్రంలోని అంశాలు ఇవే..
 
1. 25లక్షల మందికి ఇళ్ల పట్టాలు:
ఈ ఏడాది మార్చి 25, ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి రావాల్సిందిగా ప్రధానిని సీఎం కోరారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానిని కోరిన సీఎం.. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టినట్లు తెలిపారు.

అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాల్సిందిగా ప్రధానికి జగన్ విజ్ఞప్తి చేశారు. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా సంబంధిత కేంద్రమంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా మోదీని సీఎం కోరారు.
 
2. పోలవరం ప్రాజెక్ట్:
2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వినతిపత్రంలో సీఎం వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ, పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం చేయాల్సి ఉందని సీఎం తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55549 కోట్లకు చేరిందని, ఇందులో ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే రూ.33010 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని జగన్ పేర్కొన్నారు. కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలను రూ.55549 కోట్లగా ఫిబ్రవరి 2019న అంచనాలు వేసిన అంశాన్ని ప్రధానికి సీఎం వివరించారు.

దీనికి పరిపాలనా పరమైన అనుమతులు ఇంకా రాలేదని, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపగలరని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.3320 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, ఈ మొత్తాన్ని కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖను ఆదేశించాలని ముఖ్యమంత్రి కోరారు.
 
3. ప్రత్యేక హోదా:
ప్రత్యేక హోదా అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని 15వ ఆర్ధిక సంఘం చెప్పిన విషయాన్ని కూడా సీఎం వినతిపత్రంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టంచేసిన అంశాన్ని ప్రధానికి నివేదించారు. దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ఇవ్వాలని సీఎం కోరారు.  
 
4. రెవెన్యూలోటు:
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందని, ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించగలరంటూ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
 
5. గ్రాంట్లు విడుదల: 
ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ ఏడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే అని ప్రధాని ముందు సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించారు.

పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి కూడా సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలని విన్నవించారు.

అలాగే కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరారు. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే... కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులను కూడా వెంటనే విడుదలయ్యేలా చూడాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
 
6. వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు:
గడిచిన ఆరేళ్లలో 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని, గడిచిన మూడేళ్ల నుంచి  కేటాయింపులు కూడా లేవని గుర్తుచేశారు.

రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలని సీఎం గట్టిగా కోరారు. అక్కడ ఒక వ్యక్తికి తలసరి రూ.4000 ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారని ప్రధానికి సీఎం తెలిపారు.
 
7. కర్నూలుకు హైకోర్టు:
అమరావతి నుంచి హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మోదీని సీఎం కోరారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
 
8. సమగ్రాభివృద్ధి కోసం:
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. దీనికోసం పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని ప్రధానికి వెల్లడించారు.

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌‌గా అమరావతిగా ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధానికి సీఎం వివరించారు.

దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం-2020కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని సీఎం తెలిపారు.
 
9. శాసనమండలి రద్దు:
శాసనమండలి రద్దు అంశాన్ని కూడా సీఎం విజ్ఞాపనపత్రంలో పేర్కొన్నారు. గడచిన రెండు నెలల పరిణామాలను చూస్తే శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందని సీఎం పేర్కొన్నారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని సీఎం ధ్వజమెత్తారు. ఈ నేపధ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ,  శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్‌ చేసిందని సీఎం తెలిపారు. తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
 
10. దిశ చట్టం:
ఆంధ్రప్రదేశ్‌ ‘దిశ’ చట్టం-2019కు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం-2019 పై అనేకమంది ప్రశంసలు తెలిపిన అంశాన్ని ప్రధానికి వివరించారు.

మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఉద్దేశించి ఈ చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలని ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ విన్నవించారు.