మేము 1000 ఏళ్లు బతకడానికి ఇక్కడకు రాలేదు : కేసీఆర్
నాగార్జునసాగర్లో జరుగుతున్న టీఆర్ఎస్ నేతల శిక్షణ శిబిరంలో కేసీఆర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తామెవరమూ 1000 ఏళ్లు బతకడానికి ఇక్కడకు రాలేదన్నారు. తాను 70 వేల నుంచి 80 వేల పుస్తకాలను చదివానని చెప్పారు. గతంలో తాను ఎక్కడికెళ్లినా బట్టల బ్యాగ్ కన్నా, పుస్తకాల బ్యాగే పెద్దగా ఉండేదని గుర్తుచేసుకున్నారు.
అంతేకాకుండా, అనుకోకుండానే తాను రాజకీయాల్లోకి వచ్చానని కేసీఆర్ తెలిపారు. తామెవరమూ వెయ్యేళ్లు బతకడానికి ఇక్కడకు రాలేదని... అవినీతికి ఆమడ దూరంలో ఉండి, ప్రజా సేవ చేయాలని తమ నేతలకు సూచించారు. అలాగైతేనే, తెలంగాణ తొలి తరం నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. ఈ శిక్షణ శిబిరాల వల్ల మనం చాలా అనుభవాలను పంచుకున్నామని... భవిష్యత్తులో కూడా కనీసం ఆర్నెళ్లకోసారైనా శిక్షణా తరగతులు పెట్టుకుందామని చెప్పారు.