శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జనవరి 2020 (11:52 IST)

తెలంగాణాలో కూడా మూడు రాజధానులు పెట్టాలి... కేసీఆర్‌పై తెదేపా ఫైర్

మూడు రాజధానుల అంశంపై ఏమాత్రం వెనక్కి తగ్గవద్దంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా ఇవ్వడం పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆంధ్రలో మూడు రాజధానులు ఏర్పాటు చేసినట్టుగానే తెలంగాణాలో కూడా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ సూచనచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనానికి వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అంటూ వారు నిలదీశారు. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు ఎంతకైనా తెగిస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ప్రస్తుతం హైదరాబాద్‌లో మకాంవేసివున్న జగన్మోహన్ రెడ్డి మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏకాంతంగా ఆరు గంటల పాటు మారథాన్ చర్చలు జరిపిపారు. ఈ చర్చల పూర్తి సారాంశం బహిర్గతం కాలేదు. కానీ, మూడు రాజధానుల అంశంపై ఏమాత్రం వెనక్కి తగ్గాల్సిన పనిలేదనీ, మంచి నిర్ణయం.. గో హెడ్ అంటూ జగన్‌కు కేసీఆర్ సలహా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వీటిపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి చెందితే పక్కనే ఉన్న హైదరాబాదుకు అర్థికంగా నష్టం ఉంటుందనే దురుద్దేశం కేసీఆర్‌ మాటల్లో స్పష్టంగా అర్థమవుతుందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపించారు. జగన్‌ సీఎం అయిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు షాడో బాస్‌గా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నాడంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం మచిందైతే తెలంగాణాలో కూడా మూడు రాజధానులు ఏర్పాటు చేయొచ్చు కదా అని గల్లా జయదేవ్ అన్నారు. 
 
అణిచి వేయడానికి ఇదేమీ ఆర్టీసీ ఉద్యమం కాదని, తెలుగు వారి అత్మగౌరవ ఉద్యమం అని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకు డబ్బు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా విజయసాయి రెడ్డి కేసీఆర్‌ కాళ్ళకు మొక్కాడన్నారు. కేసీఆర్‌ కాళ్లపై పడడం, సాష్టాంగ నమస్కారాలు, పొర్లు దండాలు పెట్టడం ఏ1, ఏ2లకు కొత్తేమి కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు.