1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (11:22 IST)

అనంతపురం భూదందాలో ముగ్గురు "నీలి మీడియా" విలేఖరుల అరెస్టు

crime scene
అనంతపురం జిల్లాలో భూదందా కేసు ఒకటి వెలుగు చూసింది. ఈ కేసులో ముగ్గురు నీలి మీడియా విలేఖరులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 14.96 ఎకరాల భూమిని ఈ ముగ్గురు విలేఖరులు మరికొంతమందితో కుమ్మక్కై గుట్టుచప్పుడు కాకుండా విక్రయించారు. 
 
ఈ మొత్తం భూమి విక్రయ లావాదేవీల్లో రూ.14 కోట్లకు డీల్ కుదుర్చుకోగా ఇందులో రూ.75 లక్షల మేరకు చేతులు మారినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ముగ్గురు విలేఖరులతో పాటు ఓ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. 
 
ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియాల వేదికగా వరుస ట్వీట్లు చేసింది. 
 
"జగన్ రెడ్డి అబద్దాలను ప్రచార చేయడానికి సాక్షితో పాటు, టివి9 ఎన్టీవీలు ఒక్కటై వైసీపీ ప్రభుత్వ అనుకూల బులుగు మీడియాగా అవతరించిన విషయం అందరికీ తెలిసిందే. 
 
అయితే ఈ కలయిక అసత్య ప్రచారానికే పరిమితం కాలేదు. ఇప్పుడది అవినీతి బాగోతాలకు ఎదిగింది. దానికి నిదర్శనమే ఈ భూ అక్రమం. 
 
అనంతపురంలో నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి 14.96 ఎకరాల భూమిని మరొకరికి విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. 
 
ఈ కేసు విషయమై పోలీసులు విచారణ చేస్తే టీవీ-9 విలేఖరి లక్ష్మికాంత్ రెడ్డి, అతని డ్రైవర్, స్థానిక ఎన్టీవీ, సాక్షి విలేఖర్లే సూత్రధారులు అన్నవిషయం తేలింది. 
 
ఈ అక్రమ వ్యవహారం నడిపేందుకు రూ.14 కోట్లకు డీల్ కుదుర్చుకోగా, ఇప్పటికే రూ.75 లక్షలు చేతులు మారింది. 
 
సీసీ ఫుటేజ్, నగదు లావాదేవీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు విలేకరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అని వరుస ట్వీట్లలో పేర్కొంది.